సహజీవనంలో చిచ్చు.. ఆమెపై పిడిగుద్దులు.. అనుమానంతో హత్య..!
శ్రీకాకుళం : సహజీవనంలో చిచ్చు రేగింది. ఒకరికొకరు మనసుపడి కలిసున్న కాపురంలో.. కలహాలు మొదలయ్యాయి. అంతేకాదు అనుమానం పెనుభూతమైంది. చివరకు అతడిని నమ్మి వచ్చిన ఆమె.. ప్రాణాలు కోల్పోయింది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చానీయాంశమైంది.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం బాసగిట్టంగి గ్రామానికి చెందిన శాంతి.. పెదగిట్టంగి గ్రామానికి చెందిన చిన్నారావు ఒకరికొకరు ఇష్టపడ్డారు. ఇరువురి మనసులు కలిసి కొన్నాళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. ఇటీవల ఆరు నెలల కిందట తగరపువలస సమీపంలోని చిప్పాడ దివీస్ ఫ్యాక్టరీలో రోజువారీ కూలీలుగా చేరారు. అలా ఒకే దగ్గర పనిచేసుకుంటూ ఓకే రూములో కలిసి ఉంటూ హ్యాపీగా ఉన్నారు. ఆ క్రమంలో అనుమానం అనే పెనుభూతం వారి మధ్య చిచ్చు పెట్టింది.
ప్రభుత్వ పాఠశాలలో "టీసీ"కి లంచం.. హెడ్మాస్టర్ నిర్వాకం.. చివరకు..!
ఈ నెల 25వ తేదీన శాంతి ఉరి వేసుకుని చనిపోయారు. దాంతో ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే పోస్టుమార్టం నివేదిక అసలు విషయం బయటపెట్టింది. దాంతో అనుమానం వచ్చిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేశారు. కలిసుందాం రా అంటూ సహజీవనం చేస్తున్న యువకుడే ఆమెపై పిడిగుద్దులు గుద్ది ఆ తర్వాత పీక నులిమి హత్య చేసినట్లు రుజువైంది.
అనుమానంతో పదేపదే తనను ఇబ్బందులు పెడుతుండటంతో శాంతి జీర్ణించుకోలేకపోయింది. ఆ క్రమంలో ఈ నెల 25వ తేదీన ఫ్యాక్టరీలోనే ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన శాంతి.. వారు నివాసముంటున్న రేకుల షెడ్డుకు వచ్చి తలుపులు వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత చిన్నారావు కూడా అక్కడకు చేరుకున్నాడు. ఆ క్రమంలో వారి మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. దాంతో ఆమెను నోటికి ఎంతొస్తే అంత తిట్టేశాడు చిన్నారావు. అయితే నువ్వు చీటికిమాటికీ ఇలా చేస్తే పెళ్లి చేసుకోనంటూ బెదిరింపు ధోరణిలో ఆమె మాట్లాడటంతో కోపంలో హత్య చేశాడు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు పంపినట్లు తెలిపారు పోలీసులు.