ధర్మాన వ్యాఖ్యలపై దుమారం.. ఎల్లో మీడియా వక్రీకరించిందన్న మంత్రి...తనపై గెలవాలని టీడీపీ నేతలకు సవాల్
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన సభలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అమరావతిలో పెయిడ్ ఆర్టిస్టులతో ఉద్యమం నడుస్తోందని పేర్కొన్న ఆయన... ఈ క్రమంలో ఓ పచ్చి బూతు వాడినట్లుగా ఓ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటుండగా... వైసీపీ మాత్రం ధర్మాన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపిస్తోంది. మంచికి బ్రాండ్ అంబాసిడర్ అయిన ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదని మంత్రి సీదిరి అప్పలరాజు హితవు పలికారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు ఓ సవాల్ కూడా విసిరారు.
చంద్రబాబూ ... ఉత్తరాంధ్ర నుండి నాపై పోటీకి సిద్ధమా ? మంత్రి ధర్మాన కృష్ణదాస్ సవాల్
ఎల్లో మీడియా వక్రీకరించింది...: మంత్రి అప్పలరాజు
విశాఖలో రాజధాని ఏర్పాటు కోసం తాను రాజీనామాకు సిద్ధమని, తనపై పోటీ చేసి గెలవగలరా అని టీడీపీ నాయకులకు మంత్రి అప్పలరాజు సవాల్ విసిరారు. దాసన్న తన సొంత నియోజకవర్గంలో తన మనుషులతో మాట్లాడిన సంభాషణను ఎల్లో మీడియా వక్రీకరించిందని ఆరోపించారు. ఆయన బూతులు మాట్లాడినట్లు చిత్రీకరించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాసన్న రాజకీయ చరిత్రలో ఎక్కడా వివాదాలకు తావు లేదని... ఏడాదిన్నర కాలంలోనే డిప్యూటీ సీఎంగా,మంత్రిగా ఆయన తనదైన ముద్ర వేశారని అన్నారు.
టీడీపీ నేతల బూతుల సంగతేంటి...
గతంలో అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నప్పుడు టెక్కలి నియోజకవర్గంలో ఓ మహిళతో తీవ్ర అభ్యంతరకరంగా మాట్లాడారని అప్పలరాజు గుర్తుచేశారు. 'మా ప్రభుత్వం ఇచ్చిన 10వేలు తీసుకుని ఓటేయ్యవా.. అని అది నీ అమ్మ మొగుడు సొమ్మా' అంటూ అచ్చెన్నాయుడు వాడిన అసభ్యకర పదజాలం అందరికీ గుర్తుందన్నారు. టీడీపీకే చెందిన కూన రవికుమార్ ఫోన్ సంభాషణలు కూడా అందరికీ తెలుసని చెప్పారు. బూతులు బాగా మాట్లాడేవాళ్లను,వీధి రౌడీల్లా వ్యవహరించేవాళ్లకు చంద్రబాబు ప్రత్యేక గుర్తింపునిస్తున్నారని... అందుకే వాళ్లకు అధ్యక్ష పదవులు కట్టబెడుతున్నారని ఎద్దేవా చేశారు.
అభివృద్దిని ఓర్వలేకనే....
శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న అభివృద్దిని చూసి ఓర్వలేకనే ధర్మానపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భావనపాడు పోర్టు, ఉద్దానంలో రూ.700 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు, కిడ్నీ బాధితులకు ఆస్పత్రి, నేరడి బ్యారేజీ నిర్మాణం వంటి అనేక అభివృద్ది కార్యక్రమాలను ధర్మాన చేపట్టారని తెలిపారు. కరోనా కాలంలో ఎక్కడా కనిపించని ఎంపీ రామ్మోహన్నాయుడు స్టేషన్ వద్దకు దౌర్జన్యం చేసేందుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. అమరావతిలో రియల్ వ్యాపారులు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామా నడిపిస్తున్నారన్నారు.
Recommended Video
నీతి నిజాయితీ గల వ్యక్తి ధర్మాన...
ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ... రాజధానిపై ఎప్పుడు చర్చ జరిగినా విశాఖలో రాజధాని కావాలనుకుంటున్నారా లేదా అన్న ప్రశ్నకు టీడీపీ నేతల వద్ద సౌండ్ లేకుండా పోయిందన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో నరసన్నపేట పోలీస్ స్టేషన్ వద్ద క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం టీడీపీ రౌడీయిజానికి నిదర్శనమన్నారు. ధర్మాన కృష్ణదాస్ తమందరికీ కుటుంబ సభ్యుడితో సమానుడని... ఆయన నీతి,నిజాయితీల కారణంగానే ఉపముఖ్యమంత్రి,మంత్రి పదవులు దక్కాయని అన్నారు.