ఏపీలోని ఆ గ్రామ ప్రజలకు కరోనానే కాదు డయేరియా భయం .. 52 మందికి అస్వస్థత
ఇప్పుడు ఏపీలోని ఒక గ్రామం కరోనావైరస్ భయంతోనే కాదు డయేరియాతో కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతుంది . కలుషితమైన నీరు తాగటం వల్ల ఒక గ్రామ ప్రజలు డయేరియాకు గురయ్యారు. ఇక ఇంతా జరుగుతున్నా ఆరోగ్య శాఖాధికారులు ఈ గ్రామ ప్రజలను పట్టించుకున్న దాఖలాలు లేవు. గత రెండు రోజులుగా గ్రామ ప్రజలు డయేరియాతో ఇబ్బంది పడుతున్నా, కేసులు పెరుగుతున్నా విషయం బయటకు రాలేదు.
కరోనా విలయం: భారత్ స్టేజ్-3లో ఉందా? ఐసీఎంఆర్ కీలక సర్వే.. ఏపీ, తెలంగాణలో మూడేసి జిల్లాల్లో..
శ్రీకాకుళం జిల్లా గంగువారి సిగడాం మండలం (జి. సిగడాం ) మెట్టవలస గ్రామ ప్రజలకు ఇప్పుడు కరోనాతో పాటు డయేరియా భయం పట్టుకుంది. ఇప్పటికే గ్రామంలో డయేరియా పంజా విసిరింది. ఒకేసారి 52 మంది డయేరియా బారిన పడ్డారు . ఇక ఈ వ్యాధి గ్రామంలో తీవ్రంగా వ్యాపించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గ్రామంలో డయేరియా బారిన పడిన వారికి స్థానిక వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా వున్న వారిని జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇక పదుల సంఖ్యలో ప్రజలు డయేరియా బారిన పడటంతో గ్రామంలో డయేరియా ప్రబలిందని తెలుసుకున్న జిల్లా అదనపు వైద్యాధికారి , వైద్యుల మరియు అధికారుల బృందంతో నేడు గ్రామాన్ని సందర్శించారు.
తాగునీరు కలుషితం కావడం వల్ల వ్యాధి ప్రబలి ఉండవచ్చని వారు భావిస్తున్నారు . గ్రామంలో 52 మందికి డయేరియా వచ్చినా స్థానిక వైద్య అధికారులు ఎందుకు గోప్యత పాటించారో తెలీడం లేదని పేర్కొన్నారు. రెండురోజులుగా గ్రామంలో బాధితుల సంఖ్య పెరుగుతున్నా బయటకు సమాచారం తెలియనీయలేదని స్థానిక వైద్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యంతో పాటు గ్రామస్తులంతా కాచి చల్లార్చిన నీటిని తాగాలని అధికారులు సూచనలు చేస్తున్నారు . తగిన వైద్య సహాయం అందిస్తామని , ఎవరూ భయపడవద్దని అంటున్నారు .