శ్రీకాకుళం లోక్ సభ వైఎస్ఆర్ సీపీ ఇన్ఛార్జిగా జెయింట్ కిల్లర్
శ్రీకాకుళంః కొద్దిరోజుల కిందటే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి కీలక పదవి దక్కింది. శ్రీకాకుళం లోక్సభ నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలను ఆమెకు అప్పగించారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. యూపీఏ 2 ప్రభుత్వంలో కృపారాణి కేంద్రమంత్రిగా పనిచేశారు.
2009లో లోక్ సభ ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ ఎర్రన్నాయుడును ఓడించి, జెయింట్ కిల్లర్ గా గుర్తింపు పొందారు. 1996, 1998, 1999, 2004 లోక్ సభ ఎన్నికల్లో ఎర్రన్నాయుడు పోటీ చేసి, ఘన విజయం సాధించారు.
వరుసగా నాలుగుసార్లు శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలుపొందుతూ వచ్చిన ఎర్రన్నాయుడిపై సుమారు 80 వేల ఓట్లకు పైగా మెజారిటీ గెలిచి అందరి దృష్టినీ ఆకర్షించారు. 2014లో కూడా ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీకాకుళం లోక్ సభ నుంచే పోటీ చేసి ఓడిపోయారు. డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. ఆ ఎన్నికల్లో కృపారాణికి కేవలం 24 వేల వరకు మాత్రమే ఓట్లు పోలయ్యాయి.
మా డాటా చోరీ చేసి మాకే ఫోన్లా?.. వాళ్ల ప్లాన్ తిప్పికొట్టాలన్న చంద్రబాబు
2014 ఎన్నికల్లో ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి, విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రెండోస్థానంలో నిలిచింది. వైఎస్ఆర్ సీపీ అభ్యర్థిగా రెడ్డి శాంతి పోటీ చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ తరఫున కిల్లి కృపారాణి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రెడ్డి శాంతిని అసెంబ్లీ బరిలో నిలబెడతారని అంటున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూడా టీడీపీ తరఫున రామ్మోహన్ నాయుడే పోటీ చేస్తారు. ఆయనపై కృపారాణే సరైన అభ్యర్థి అని వైఎస్ఆర్ సీపీ భావిస్తోంది.