చివరి సెల్ఫీ: సముద్రంలో నలుగురు విద్యార్థులు గల్లంతు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సముద్ర స్నానాలకు వెళ్లిన నలుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో అలల తాకిడికి గురయ్యారు. సముద్రంలో కొట్టుకుని పోయారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం కళింగపట్నం తీర ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మృతులంతా శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు కళాశాల ఇంటర్మీడియట్ విద్యార్థులు. సమాచారం అందుకున్న వెంటనే మెరైన్ పోలీసులు స్థానిక మత్స్యకారులతో కలిసి విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు.
శ్రీకాకుళానికి చెందిన విద్యార్థులు ప్రవీణ్కుమార్ రెడ్డి, ఏపీ హెచ్బీ కాలనీకి చెందిన కురుమూరు సంజయ్, మహాలక్ష్మీ నగర్కు చెందిన యజ్ఞమయ పండా, గుజరాతిపేటలో ఉంటున్న అనపర్తి సుధీర్, రాజసింహ ఆదివారం సెలవురోజు కావడంతో కళింగపట్నం బీచ్ కు కొద్దిదూరంలో ఉన్న మత్స్యలేశం ప్రాంతానికి వెళ్లారు.
సాయంత్రం నాలుగు గంటల సమయంలో స్నానాలకు దిగారు. సెల్ఫీ దిగడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో అలల తాకడికి మొదట సంజయ్ అనే విద్యార్థి కొట్టుకునిపోయాడు. అతణ్ని కాపాడే క్రమంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి, పండా, సుందర్, రాజసింహ ప్రయత్నించారు.
విద్యార్థులు కేకలు వేయడాన్ని గమనించిన స్థానిక మత్స్యకారులు రాజసింహను కాపాడగలిగారు. మిగిలిన వారు గల్లంతయ్యారు. సాయంత్రం అయిదున్నర గంటల సమయంలో సుందర్ మృతదేహం తీరానికి కొట్టుకుని వచ్చింది.
మిగిలిన వారి కోసం మెరైన్ పోలీసులు, మత్స్యకారులు గాలిస్తున్నారు. వారంతా మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి, డీఎస్పీ సంఘటనాస్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు సమాచారాన్ని ఇచ్చారు.