నిన్న రాయలసీమ..నేడు ఉత్తరాంధ్ర: ఉప్పొంగుతున్న నదులు!
శ్రీకాకుళం: నిన్నటిదాకా రాయలసీమలో కసిదీరా.. కరవు తీరా కురిసిన భారీ వర్షాలు..ఇక ఉత్తరాంధ్రను ముంచెత్తుతున్నాయి. రెండురోజులుగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఏకధాటిగా వానలు పడుతున్నాయి. పొరుగునే ఉన్న ఒడిశా సరిహద్దు జిల్లాల్లో సైతం కురుస్తోన్న భారీ వర్షాలకు ఈ ప్రాంతంలోని అన్ని నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సాధారణ స్థాయిలో కూడా కనిపించని వరాహ నది అనూహ్యంగా వరద ప్రవాహాన్ని సంతరించుకుంది. కోస్తా తీర ప్రాంత జిల్లాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ప్రకాశం, తూర్పు గోదావరి జిల్లా తీర ప్రాంత గ్రామాలు ఈదురు గాలులు వణికి పోయాయి.
చైనా సంస్థకు భూమిపూజ: 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే..!
మరో రెండురోజులు భారీ వర్షాలే..
ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని విశాఖపట్నంలోని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాబోయే 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వారు అంచనా వేశారు. శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రత్యేకించి ఒడిశా సరిహద్దులకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఉద్దానం ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. కవిటిలో అత్యధికంగా 200 మిల్లీమీటర్లు, సోంపేట-154, కంచిలి-152 మిల్లీ మీటర్ల వర్షం పడినట్లు వాతావారణ శాఖ వెల్లడించింది.
గొట్టా బ్యారేజీ గేట్ల ఎత్తివేత..
ఒడిశాలోని గజపతి నగరం, రాయగడ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వంశధార నదిలో వరద ప్రవాహం భారీగా పెరిగింది. ఫలితంగా- ఈ నదిపై నిర్మించిన గొట్టా బ్యారేజీ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఎగవ నుంచి ఇన్ ఫ్లో అధికంగా ఉండటంతో జలవనరుల శాఖ అధికారులు గేట్లను ఎత్తేశారు. సుమారు 23 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలి వేస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా నీటిని వదిలినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వరదనీటి ప్రవాహానికి దిగువన పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. రోడ్లు ధ్వంసం అయ్యాయి.
పోటెత్తిన వరహా నది
విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలంలో వరాహ నది ఉప్పొంగింది. వరద నీటితో పోటెత్తుతోంది. దీని ప్రభావం సోముదేవునిపల్లిపై పడింది. వరద ప్రవాహానికి వరాహ నది సోముదేవుని పల్లి వద్ద గట్టు భారీగా కోతకు గురైంది. ఆ గట్టు మీద నిర్మించిన నూకాలమ్మ అమ్మ వారి ఆలయం కుప్పకూలిపోయింది. నదిలో కొట్టుకునిపోయింది. దీనికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కోత మరింత పెరిగి, వరద నీరు గ్రామంలోకి ప్రవేశించే అవకాశం లేకపోలేదని గ్రామీణులు ఆందోళన చెందుతున్నారు. గట్టు తెగిన విషయం తెలుసుకున్న వెంటనే రెవెన్యూ అధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కుదిపేసిన ఈదురుగాలులు
ప్రకాశం జిల్లా తీర ప్రాంత గ్రామాల్లో సముద్రం మీదుగా వీచిన ఈదురు గాలులు వణికించాయి. ఈదురు గాలుల తాకిడి మత్స్యకారుల నివాసాలు దెబ్బతిన్నాయి. పూరి గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి. సముద్రం సైతం అల్లకల్లోలంగా మారడం వల్ల వలలు, నాటు పడవలు కొట్టుకునిపోయినట్లు తెలుస్తోంది. సింగరాయకొండ మండలంలోని పలు తీర ప్రాంత గ్రామాల్లో ఇదే పరిస్థితి చోటు చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి. ఈదురు గాలులకు నాటు పడవలు, బోట్లు వలలు కొట్టుకునిపోయాయని, ఫలితంగా 50 లక్షల రూపాయల వరకుక నష్టం వాటిల్లాయని మత్స్యకారులు వాపోతున్నారు.