శభాష్ కళ్యాణి.. నిరుపేద.. మనసు మాత్రం పెద్ద, దాచిన డబ్బులతో బోరు..
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటిలీలో హడ్కోకాలనీ ఎత్తైన ప్రాంతంలో ఉంటుంది. వారికి తాగునీరు అందదు. స్థానికులకు నీటి కష్టాలు తప్పటం లేదు. వేసవి వచ్చిందంటే చాలు వారి బాధలు వర్ణనాతీతం. అడుగంటిన బోర్లు, నీళ్లు అందించని కుళాయిలు. బిందెడు నీరు కావాలంటే భగీరథ యత్నమే. ఇవే ప్రతీరోజు అక్కడ కనిపించే నీటి కష్టాలు. ఈ కష్టాలను చూసి కళ్యాణి చలించిపోయింది.
దాచుకోలేదు..
డబ్బును దాచుకునే కంటే దానితో బోర్ వేయిస్తే ఎలా ఉంటుంది? నీరు తనకే కాదు కాలనీ వాసులందరికీ అవసరం కదా? అని ఆలోచించింది. బోర్ వేయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో ముందడుగు వేసింది. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన కూలీ డబ్బులను లక్ష రూపాయలను స్థానిక పెద్దలకు అందించింది. మంచి మనస్సుతో చేసిన పని సక్సెస్ అయి తీరుతుందని మరోసారి నిరూపితమైంది. కళ్యాణి డబ్బలు ఇవ్వటం పెద్దలు బోర్ పనులు మొదలు పెట్టడ గంగమ్మ పైకి తన్నుకు రావటంతో ఇలా అంతా చకచకా జరిగిపోయాయి.
పెద్ద మనసు.. పులకించిన గంగమ్మ
కళ్యాణి పెద్ద మనస్సుకు పులకించిపోయిన గంగమ్మ ఉబికి రావటంతో స్థానికులకు నీటి కష్టాలు తీరాయి. ఏళ్లుగా పడుతున్న నీటి కష్టాలు తీరినందుకు స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హడ్కోకాలనీలో బోరు వేయడంతో.. ఆ ప్రాంతంలోని రెండు ప్రధాన వీధులకు నీటి సమస్య తీరిందని.. అధికారులు కూడా పట్టించుకోని సమయంలో కల్యాణి చేసిన సాయం ఎప్పుడూ గుర్తుంటుందని అంటున్నారు.
Recommended Video
మురిసిన కళ్యాణి..
బోరులో నీరు పైకి రావటంతో స్థానికులతోపాటు కళ్యాణి మురిసిపోయింది. ఇప్పటికైనా నీటి కష్టాలు తీరాయి అంటూ సంతోష పడింది. కాయకష్టం చేసుకొని ఒక్కో రూపాయి పోగుచేసుకున్న మహిళ.. ఆ డబ్బులతో బోరు ఏర్పాటు చేయడంపై సిక్కోలు జిల్లా వాసులు అభినందిస్తున్నారు. ఆమెను చూసి మరింత మంది స్ఫూర్తి పొందాలని అంటున్నారు. దాచుకున్న డబ్బును స్థానికుల కోసం ఖర్చుపెట్టిన కళ్యాణి లాంటి మంచి మనస్సు గలవారు ఉంటే నీటి కష్టమే కాదు ఏ కష్టాన్నైనా ఇట్టే జయించవచ్చు అని నిరూపించారు.