సిక్కోలులో కంప్లీట్ లాక్ డౌన్.. నెలరోజులపాటు... 1 గంట తర్వాత 144 సెక్షన్ అమలు..
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అన్నీ చర్యలు చేపడుతున్నారు. శ్రీకాకుళం పట్టణంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో మరింత కఠినంగా నిబంధనలను అమలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం 1 గంట వరకు బయటకు వచ్చేందుకు అనుమతి ఇస్తున్నారు. నెలరోజుల పాటు 144 సెక్షన్ అమలు చేయబోతున్నారు.
మధ్యాహ్నం 1 గంట దాటిన తర్వాత బయట తిరగొద్దు అని స్పష్టంచేస్తున్నారు. ఎవరైనా బయట కనిపిస్తే క్రిమినల్ కేసులు పెట్టేందుకు వెనకాబడబోమని అధికారులు తేల్చిచెప్పారు. ఒంటి గంట తరువాత మందుల దుకాణాలు మినహా ఏ ఇతర దుకాణాలు తెరవబోమని స్పష్టంచేశారు. అలాగే శ్రీకాకుళం పట్టణంలోకి మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ప్రవేశాన్ని కూడా నిలిపివేశారు. ఎవరైనా రావాలి/ పోవాలి అనుకుంటే ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది.
శ్రీకాకుళం పట్టణంలోకి ప్రవేశించే ఆరు మార్గాలు -తోటపాలెం జంక్షన్, బలగ ఏసీబీ కార్యాలయం మార్గం, పొన్నాడ బ్రిడ్జి, అరసవల్లి జంక్షన్, రామలక్ష్మణ జంక్షన్, కిల్లిపాలెం జంక్షన్ వద్ద అనవసరంగా వచ్చేవారిని గుర్తించి.. తిరిగి పంపించనున్నారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేవారు మాస్క్, ఫేస్ ఫీల్డ్ తప్పనిసరి అని తేల్చిచెబుతున్నారు. షాపు/ మార్కెట్ల వద్ద భౌతిక దూరం పాటించాలని కోరుతున్నారు. తరచూ చేతులను కడుక్కొవాలని సూచిస్తున్నారు.