పవన్ కల్యాణ్కు బిగ్ షాక్.. పొరుగు రాష్ట్రంలో వకీల్ సాబ్ థియేటర్లు సీజ్
శ్రీకాకుళం: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ.. వివాదాల్లో నలుగుతూనే ఉంది. ఆ సినిమా చుట్టూ వివాదాలు ముసురుకుంటూనే ఉన్నాయి. బెనిఫిట్ షోలు మొదలుకుని టికెట్ల రేట్ల పెంపు వ్యవహారం వరకూ అన్నీ వివాదాలే. దీనిపై ఏపీ హైకోర్టులో పిటీషన్లు సైతం దాఖలయ్యాయి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచారం కూడా దీనికి తోడైంది. ఫలితంగా రాజకీయంగానూ ఈ మూవీ విమర్శలు, ప్రతి విమర్శలకు కేంద్రబిందువైంది.
ఒక తిరుపతి..నలుగురు పవన్ కల్యాణ్లు: ఎలాగంటారా: ఫ్యాన్స్ అయోమయం
ఈ పరిణామాల మధ్య మన పొరుగునే ఉన్న ఒడిశా ప్రభుత్వం వకీల్ సాబ్కు బిగ్ షాక్ ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గజపతి జిల్లాలోని పర్లాఖెముండిలో వకీల్ సాబ్ సినిమాను ప్రదర్శిస్తోన్న రెండు థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. థియేటర్ల యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ప్రకృతి వైపరీత్యాల నివారణ చట్టం కింద కేసు పెట్టారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి ఆనుకునే ఉంటుంది పర్లాఖెముండి. తెలుగువారు చెప్పుకోదగ్గ సంఖ్యలో అక్కడ నివసిస్తుంటారు.
దాదాపు అన్ని తెలుగు సినిమాలు కూడా పర్లాఖెముండిలో విడుదలవుతుంటాయి. పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ కూడా అక్కడ విడుదలైంది. జై మా, లక్ష్మీ సినిమా హాల్లో ఈ మూవీని విడుదల చేశారు. దీన్ని చూడటానికి ప్రేక్షకులు ఎగబడ్డారు. వందలాది మంది పవన్ కల్యాణ్ అభిమానులు వకీల్ సాబ్ మూవీని చూడటానికి థియేటర్లకు చేరుకున్నారు. వారందరికీ టికెట్లను విక్రయించింది థియేటర్ల యజమాన్యం. ఆయా థియేటర్లను సీజ్ చేయడానికి ఇదే కారణమైంది.
ఒడిశాలో కరోనా ప్రొటోకాల్స్ మధ్య థియేటర్లు కొనసాగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో 50 శాతం మాత్రమే ఆక్యుపెన్సీకి అధికారులు అనుమతి ఇచ్చారు. అందులో గజపతి జిల్లా కూడా ఉంది. దీనికి విరుద్ధంగా యాజమాన్యం వ్యవహరించడంతో కేసు నమోదు చేశారు. 10 వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు. కోవిడ్ 19 ప్రొటోకాల్స్ను ఉల్లంఘించిన కారణంతో రాయగడలోని మరో సినిమా హాల్ను కూడా అధికారులు సీజ్ చేశారు.