అచ్చెన్నాయుడుకి పోలీసులు నోటీసులు.. ఎందుకంటే..
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ చీఫ్ అచ్చెన్నాయుడుకు పోలీసులు నోటీసులు జారీచేశారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి ఎంపీడీఓ ఆఫీసు ప్రాంగణంలో విగ్రహాలు ధ్వంసం, పాలేశ్వరస్వామి ఆలయ జంక్షన్ వద్ద విగ్రహ వివాదం నేపథ్యంలో నోటీసులు జారీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రోద్బలం మేరకు టీడీపీ నాయకులు రెచ్చిపోయారని వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నోటీసులు పంపారు.
నోటీసులకు సంబంధించి గురువారం సాయంత్రం 5 గంటలకు కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి ఎదుట హాజరుకావాలని అందులో స్పష్టం చేశారు. ఇటీవల సంతబొమ్మాళి ఎంపీడీఓ కార్యాలయం వద్ద విగ్రహాల ధ్వంసం ఘటన స్థానికంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. కొన్నిరోజులకు పాలేశ్వరస్వామి ఆలయ జంక్షన్ లో సిమెంట్ దిమ్మెపై నంది విగ్రహం వెలిసింది. ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకేనని వైసీపీ నేతలు ఆరోపించారు.
Recommended Video
వాస్తవానికి ఆ దిమ్మెపై దివంగత నేత ఎర్రన్నాయుడు విగ్రహం ఏర్పాటు చేయాలని భావించారు. కానీ వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ కార్యక్రమం నిలిచిపోయింది. ఇటీవలే ఆ దిమ్మెపై వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. దాంతో రాత్రికి రాత్రే ఆ దిమ్మెపై నంది విగ్రహం వెలిసింది. ఇలా ఒకరికొకరు విగ్రహాలను పెట్టుకోవడంతో వివాదం ముదిరింది.