నాడు వాజ్పేయి.. నేడు మోడీ, బీజేపీ వల్లే అన్నీ రంగాల అభివృద్ది.. సిక్కోలులో సోమువీర్రాజు
బీజేపీతోనే అభివృద్ది సాధ్యం అని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. కేంద్ర అందజేస్తోన్న సంక్షేమ ఫలాలు సామాన్యులకు అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరికీ ఉందన్నారు. బడుగు, బలహీనవర్గాల సాదక బాదకలను పరిష్కరించేంది బీజేపీ ప్రభుత్వాలేనని చెప్పారు. కాంగ్రెస్ అంటే కుంభకోణాలేనని ఆయన ధ్వజమెత్తారు. ఆయన గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఏపీ బీజేపీ చీఫ్ పదవీ చేపట్టిన తర్వాత.. తొలిసారి పర్యటించగా.. నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పర్యటన వివరాలను సోము వీర్రాజు ట్వీట్ చేశారు.
బీజేపీ వల్లనే డెవలప్ సాధ్యమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. క్షేత్రస్థాయిలో జనానికి కేంద్రం అందిస్తోన్న సంక్షేమ పథకాల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం గురించి సోము వీర్రాజు ప్రస్తావించారు.
ఇదివరకు బీజేపీ ప్రభుత్వమే సర్వ శిక్ష అభియాన్ తీసుకొచ్చిందని తెలిపారు. ఆనాడు వాజ్ పేయి హయాంలో విద్యావిధానంలో సమూల మార్పులు వచ్చాయని గుర్తుచేశారు. నేడు మోడీ కూడా నూతన విద్యావిధానం ప్రవేశ పెట్టారని తెలిపారు. దీంతో భావి తరాలకు బంగారు బాట వేశారని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల నూతన విద్యా విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నిర్బంద విద్య, డిగ్రీ నాలుగేళ్లు తదితర కీలక చర్యలు తీసుకుంది. ఆ చర్యలను సోము వీర్రాజు కొనియాడారు.