లాక్డౌన్: రోడ్డు మధ్యలో భారీ గుంత, డోలీలో గర్భిణీ నరకయాతన(వీడియో)
అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో సోమవారం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ కట్టడికి విధించిన లాక్ డౌన్, అధికారులు తీసుకున్న చర్యలతో ఓ నిండు గర్భిణీ నరకయాతన అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కొత్తూరు మండలంలోని అల్తీ పంచాయతీ దిగువరాయిగూడ గ్రామానికి చెందిన సవర వాణిశ్రీ అనే మహిళకు సోమవారం ఉదయం పురిటినొప్పులు వచ్చాయి. సమాచారం అందుకున్న ఏఎన్ఎం సవరమ్మ, ఆశా కార్యకర్తలు ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
దిగువరాయిగూడ నుంచి ఒడిశా సరిహద్దు వరకు ఆటోలో తీసుకువచ్చారు. కరోనా నేపథ్యంలో రాకపోకలను అడ్డుకునేందుకు రెండు రోజుల క్రితం అల్తీ పంచాయతీకి వెళ్లే రహదారిని మిలగాం వద్ద ఒడిశా అధికారులు తవ్వేశారు. దీంతో ఆమెను ఆటో నుంచి దింపి డోలి సహాయంతో మోసుకెళ్లి మిలగాం దాటించారు.
Man says Odisha Govt civic authorities dug up the carriage way, falling under AP- Odisha border. Highly dangerous for the pregnant lady 😟 however Hats off to the family & friends for pulling of such a challenge. @IPR_Odisha @CMO_Odisha please address this. pic.twitter.com/I2xO4hE1Nj
— @CoreenaSuares (@CoreenaSuares2) April 27, 2020
అనంతరం అక్కడి నుంచి మరో ఆటోలో, ఆ తర్వాత 108 అంబులెన్స్లో కొత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, డోలీలో తీసుకెళ్లే సమయంలో రోడ్డుపై గుంత బాగా లోతుగా ఉండటంతో ఆ గర్భిణీ నరకయాతన అనుభవించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది.