శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఆత్మహత్య .. అనారోగ్యమే కారణమా ?
ఒకపక్క ఏపీలో పోలీసులు లాక్ డౌన్ విధులతో బిజీగా ఉన్న సమయంలో ఒక పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకోవటం ఏపీలో కలకలం రేపింది . అనారోగ్య కారణాలతో ఓ పోలీస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారని భావిస్తున్నారు . శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణ వర్మ శుక్రవారం విశాఖ బీచ్ రోడ్డులోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనకు ఇటీవలే హార్ట్ ఆపరేషన్ కూడా అయ్యింది. అనారోగ్య కారణాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారని భావిస్తున్నారు.
కృష్ణ వర్మ శ్రీకాకుళం జిల్లాలో దాదాపు పదేళ్లపాటు ఎస్ఐగా పని చేశారు. అనంతరం డీఎస్పీగా పదోన్నతి లభించింది. పోలీసు శాఖలో ఆయనకు మంచి వ్యక్తిగా గుర్తింపు ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అసలు కృష్ణ వర్మ మృతికి అనారోగ్య కారణాలేనా ? మరేదైనా కుటుంబ సమస్యలు గానీ , ఉద్యోగ పరమైన ఇబ్బందులు కానీ ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా ఓ డీఎస్పీ స్థాయి అధికారి ఆత్మహత్య చేసుకోవడం ఏపీ పోలీసు శాఖలో కలకలంగా మారింది .