వీధిరౌడీల్లా రెచ్చిపోయిన సిక్కోలు విద్యార్థులు, పీఎస్కు కూతవేటు దూరంలో డిష్యూం.. డిష్యూం...
శ్రీకాకుళం జిల్లా పాలకొండలో విద్యార్థులు రెచ్చిపోయారు. సినిమా స్టైల్ను తలపించేలా రోడ్డుపై బాహా బాహీకి దిగారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకొని భయాందోళన కలిగించారు. ఫస్ట్, సెకండియర్ విద్యార్థుల మధ్య గత కొంతకాలంగా ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అయితే పోలీసుస్టేషన్కు కూతవేటు దూరంలో ఘటన జరిగినా.. ఖాకీలు స్పందించలేదు. కాలేజీ యాజమాన్యం కూడా మిన్నకుండిపోయింది.
పాలకొండ కాలేజీలో చదువుతోన్న ఫస్టియర్, సెకండియర్ విద్యార్థుల మధ్య గొడవలు జరుగుతోన్నాయి. ఇటీవల తరగతి గది విషయంలో ఫైట్ జరిగింది. శుక్రవారం ఫస్టియర్ విద్యార్థి బైక్.. సెకండియర్ విద్యార్థి బైక్ను ఢీ కొంది. దీంతో గొడవ ప్రారంభమైంది. రెండు వర్గాలకు చెందిన విద్యార్థుల మధ్య మొదలైన మాటల ఘర్షణ చేతలకు చేరింది. రెండు వర్గాలు వీధి రౌడీల్లా కొట్టుకున్నారు.
విద్యార్థులు దాడి చేసుకోవడంతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాదాపు గంటపాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విద్యార్థులు దాడి చేసుకున్నా.. ఇటు పోలీసులు, అటు కాలేజీ యాజమాన్యం స్పందించలేదు. తర్వాత పరిస్థితి సద్దుమణగడంతో ట్రాఫిక్ క్లియరైంది.
మీది ఏ ఊరు, ఏ ప్రాంతం అని ఇరు వర్గాలు గొడవకు దిగారని అక్కడున్న వారు చెబుతున్నారు. పదుల సంఖ్యలో విద్యార్థులు ఉండటంతో వారిని ఆపే ప్రయత్నం చేయలేకపోయామని అంటున్నారు.