విజయసాయి రెడ్డి కారుపై చెప్పులు: కళా వెంకట్రావ్ అరెస్ట్: శ్రీకాకుళం ఉద్రిక్తత: బీసీ కార్డ్ తీసిన టీడీపీ
శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీలో అరెస్టుల పర్వం ఆరంభమైనట్లు కనిపిస్తోంది. దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఘటనల్లో ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తోన్న టీడీపీ నాయకులతో పాటు కొందరు సీనియర్లనూ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ వరుస అరెస్టుల పర్వం.. రాజకీయ దుమారానికి తెర తీసింది. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందంటూ తెలుగుదేశం నేతలు భగ్గుమంటున్నారు. ఉద్దేశపూరకంగానే జగన్ సర్కార్ తమ పార్టీ నేతలను అరెస్ట్ చేస్తోందని మండిపడుతున్నారు. రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగుతోందంటూ ఆరోపణలను సంధిస్తున్నారు.
ట్రంప్ వైట్హౌస్ను వీడిన వేళ..జో బిడెన్ సంచలన ట్వీట్: దిసీజ్ యువర్ టైమ్: ఒబామా
సాయిరెడ్డి కారుపై చెప్పులు విసిరిన ఘటనలో..
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి, ఆ పార్టీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావ్ను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని రాజాంలో కొద్దిసేపటి కిందటే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థాన్ని సందర్శించిన సందర్భంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి కారుపై చెప్పులతో దాడి చేసిన ఘటనలో కళా వెంకట్రావ్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
బుచ్చయ్య చౌదరి పీఏ అరెస్ట్ తరువాత..
టీడీపీకే చెందిన సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యక్తిగత సహాయకుడు సందీప్ను అరెస్టు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే కళా వెంకట్రావ్ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తూర్పు గోదావరి జిల్లా హుకుంపేటలో వినాయకుడి విగ్రహానికి మలినం పూసిన ఘటనలో పోలీసులు సందీప్ను అరెస్ట్ చేశారు. ఆయనను కర్నూలు జిల్లా శ్రీశైలంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినాయకుడి విగ్రహానికి మలినం పూసిన ఘటనలో ఆయన మత విధ్వేషాలను రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
200 మందికి పైగా పోలీసులు..
ఇదే ఘటనలో తొలుత టీడీపీ నేత బాబుఖాన్ చౌదరి అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ తరువాత సందీప్ అజ్ఙాతంలోకి వెళ్లిపోయారు. ఆయన శ్రీశైలంలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడే అరెస్టు చేశారు. ఆ వెంటనే కళా వెంకట్రావ్ను అరెస్ట్ చేశారు. తనపై చెప్పులు విసిరిన ఘటనలో విజయసాయి రెడ్డి ఇదివరకే కళా వెంకట్రావ్ సహా కొందరు టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు మేరకు కళా వెంకట్రావ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను అదుపులోకి తీసుకోవడానికి సుమారు 200 మంది పోలీసులు రాజాంకు వెళ్లినట్లు సమాచారం.
మండిపడ్డ లోకేష్..
కళా వెంకట్రావ్ అరెస్ట్ పట్ల టీడీపీ అగ్ర నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామతీర్థంలో రాముడి విగ్రహం తల ఎత్తుకెళ్లిన వారిని పట్టుకోలేకపోయిన చేతకాని సర్కారు, అత్యంత సౌమ్యుడైన బీసీ నేత..టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావ్ను అక్రమంగా అరెస్ట్ చేసిందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ ఆరోపించారు. అధికారం అండతో ఇంకెంతమంది బీసీ నేతలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయిస్తారని విమర్శించారు. జగన్ సర్కార్కు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.