పెళ్లానికి వాట్సప్ పెట్టాలంటే జగన్ పర్మిషన్ అవసరమా? అచ్చెన్న బాహుబలి: ఇది దేవుడి స్క్రిప్ట్
శ్రీకాకుళం: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 151 స్థానాలతో ఘన విజయాన్ని అందించింది.. తమపై కక్ష సాధింపులను చర్యలను తీసుకోవడానికి కాదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలను పరిపాలించడానికి అధికారం అప్పగించారే తప్ప ప్రతీకార రాజకీయాలను తీర్చుకోవడానికి కాదని అన్నారు. తమ పార్టీ కార్యకర్తలు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన నాయకులు, ప్రజలపై వైఎస్ జగన్ కక్ష సాధిస్తున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన శ్రీకాకుళంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడి కుటుంబాన్ని పరామర్శించారు.
నారా లోకేష్ పరామర్శ యాత్ర: మొన్న తాడిపత్రి..నేడు టెక్కలి: అరెస్టయిన నేతల కుటుంబాలకు భరోసా
దళితులు, బడుగులను అణచివేయడమే..
దళితుడైన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్, గంగాధర నెల్లూరులో డాక్టర్ అనితారాణిని ప్రభుత్వం అక్రమ కేసులను నమోదు చేసిందని నారా లోకేష్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పార్టీ మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్పై అనేక కేసులు పెట్టారని చెప్పారు. మన్సాస్ ట్రస్ట్ విషయంలో తమ పార్టీ సీనియర్ నేత అశోక గజపతిరాజును ఏ విధంగా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందో రాష్ట్రం మొత్తం చూసిందని అన్నారు. ఒక పెళ్లికి వెళ్లిన మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీమంత్రి యనమల రామకృష్ణుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు పెట్టారని నారా లోకేష్ ధ్వజమెత్తారు.
అచ్చెన్న నిలదీస్తున్నందుకే..
దాదాపు 10 శాఖలకు మంత్రిగా పనిచేసిన అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు కింద పెట్టారని అన్నారు. 151 మంది కాలకేయ సైనికులను ఎదుర్కొంటున్నందుకే.. బాహుబలి వంటి అచ్చెన్నాయుడిపై జగన్ ప్రభుత్వం కేసు నమోదు చేసిందని నారా లోకేష్ మండిపడ్డారు. బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ను ప్రభుత్వం తగ్గించిందని విమర్శించినందుకు, బీసీ సబ్ ప్లాన్ నిధులను మంజూరు చేయాలని డిమాండ్ చేసినందుకు.. అచ్చెన్నాయుడిని ప్రభుత్వం జైలుకు పంపించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే ఈఎస్ఐ ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర నామమాత్రంగా ఉంటుందని చెప్పారు.
దాని విలువ మూడు కోట్లే..
తెలంగాణలో అమలు చేస్తోన్న టెలి హెల్త్ సర్వీసెస్ సేవలను ఏపీలో కూడా అమలు చేయాలని అచ్చెన్నాయుడు లేఖ రాసినందుకు.. దాన్ని కుంభకోణం అని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోందని నారా లోకేష్ విమర్శించారు. ఈ కుంభకోణంపై ఇప్పటికే విజిలెన్స్ నివేదిక వచ్చిందని, ఇందులో పొందుపరిచిన తొమ్మిది అంశాల్లో ఏ ఒక్క దాంట్లో కూడా అచ్చెన్నాయుడి పేరు లేదని నారా లోకేష్ అన్నారు. జగన్ ప్రభుత్వంపై ఎవ్వరు పోరాడినా కేసులు పెట్టి, జైలుపాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు. 150 కోట్ల రూపాయల కుంభకోణం అని వైసీపీ మంత్రులు చెబుతున్నారని, నిజానికి దాని విలువ మూడు కోట్ల రూపాయలేనని అన్నారు.
జగన్ రెడ్డి ఆర్థిక నేరగాడు..
అచ్చెన్నాయుడిని విచారణకు పిలిపించి.. ప్రశ్నించి ఉండొచ్చని, అలాంటిది ఆయనను టెర్రరిస్టును బంధించినట్లు బంధించారని నారా లోకేష్ మండిపడ్డారు. అచ్చెన్నాయుడు నిబద్ధత గల నాయకుడని, జగన్ రెడ్డిలాగా ఆర్థిక నేరస్తుడు కాదని అన్నారు. ఆయనకు ఆపరేషన్ జరిగిందని తెలిసినప్పటికీ.. ఇక్కడి నుంచి అమరావతి వరకు రోడ్డు మార్గంగా తీసుకెళ్లారని చెప్పారు. ప్రజల తరఫున పోరాడే నాయకులందరినీ జైలుకు పంపిస్తోందని అన్నారు. ఇలా ఎన్నాళ్లు తమ పార్టీ నేతలను జైలుకు పంపిస్తారో చూస్తామని నారా లోకేష్.. జగన్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
బిహార్లా ఏపీ
దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ ఓ బిహార్లా మారిపోయిందని నారా లోకేష్ అన్నారు. మన రాష్ట్రం ఏమైపోతోందోనని బాధగా ఉందని అన్నారు. ఏ ఒక్కర్నీ కూడా తాము వదలబోమని, అన్నీ రాసుకుంటున్నామని, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో అంశాలవారీగా పోరాడామని, ఇప్పుడు జగన్ రెడ్డిని ఎదుర్కొంటున్నామని అన్నారు. దేవుడు ఉన్నాడని, అన్నీ చూస్తున్నాడని అన్నారు. దేవుడి స్క్రిప్ట్ ప్రకారమే తాము అధికార పార్టీకి అన్నీ వడ్డీతో సహా చెల్లిస్తామని నారా లోకేష్ హెచ్చరించారు. అన్నీ రాసి పెట్టుకుంటున్నామని అన్నారు.
Recommended Video
ఫేస్బుక్లో పోస్ట్ చేయడానికి
ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టడానికి జగన్ రెడ్డికి ఫోన్ చేసి, అనుమతి తీసుకోవాలా? అని ప్రశ్నించారు. సొంత పెళ్లానికి వాట్సప్ పెట్టడానికి జగన్ రెడ్డి పర్మిషన్ అవసరమా? అని మండిపడ్డారు. 66 సంవత్సరాల ఒక తాతయ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఆయనను అరెస్టు చేశారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 108 పేరుతో ఒక మంచి పథకాన్ని ప్రవేశపెడితే.. అందులోనూ జగన్ రెడ్డి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతి సంక్షేమ పథకంలోనూ అవినీతికి పాల్పడుతున్నారని, త్వరలోనే తగిన మూల్యాన్ని చెల్లించుకుంటారని హెచ్చరించారు.