నారా లోకేష్ పరామర్శ యాత్ర: మొన్న తాడిపత్రి..నేడు టెక్కలి: అరెస్టయిన నేతల కుటుంబాలకు భరోసా
అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయాల్లో యాక్టివ్ మోడ్లోకి వచ్చేశారు. అరెస్టయిన పార్టీ నాయకుల కుటుంబాలను పరామర్శించడంలో ఆయన బిజీ అయ్యారు. ఈ విషయంలో రాష్ట్రం ఆ మూల నుంచి ఈ మూలకు ఆయన ప్రయాణం సాగిస్తున్నారు. మొన్నటికి మొన్న అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళ్లి పార్టీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన నారా లోకేష్.. తాజాగా శ్రీకాకుళం జిల్లా వెళ్తున్నారు. టెక్కలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి కుటుంబాన్ని ఆయన పరామర్శించబోతున్నారు.
ఆ ఇద్దరు నాయకులు కూడా వందల కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడిన కేసుల్లో అరెస్టయిన వారే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. లారీలుగా తిప్పడానికి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఛాసిస్లను ప్రైవేటు బస్సులుగా తిప్పడంతో పాటు, కొన్ని కీలక పత్రాలను ఫోర్జరీ చేసిన కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి అరెస్టు అయ్యారు. వందల కోట్ల రూపాయల ఈఎస్ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడు అరెస్టు అయ్యారు. ప్రస్తుతం వారిద్దరూ పోలీసుల కస్టడీలో ఉన్నారు. విచారణను ఎదుర్కొంటున్నారు.
ఇవన్నీ అక్రమ కేసులేనని ఆరోపిస్తోంది తెలుగుదేశం పార్టీ. రాజకీయంగా కక్ష సాధించడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికే తమ పార్టీ నాయకులపై అక్రమంగా కేసులను బనాయించిందని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సహా పలువురు నేతలు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నార. ప్రభుత్వంపై విమర్శలను గుప్పిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నారా లోకేష్ అరెస్టయిన నేతల కుటుంబానికి పరామర్శించే కార్యక్రమాన్ని చేపట్టారు నారా లోకేష్.
Recommended Video
ప్రస్తుతం నారా లోకేష్ శ్రీకాకుళం వెళ్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఆయన టెక్కలికి చేరుకుంటారు. అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అచ్చెన్నాయుడి భార్య, ఇతర కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. అనంతరం శ్రీకాకుళం జిల్లా పార్టీ నాయకులను కలుసుకుంటారు. జిల్లాల్లో పార్టీ స్థితిగతులపై ఆరా తీస్తారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ వెంట టీడీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ఇతర నాయకులు ఉంటారు. అనంతరం రాత్రి ఆయన ఉండవల్లి నివాసానికి చేరుకుంటారని పార్టీ నాయకులు చెబుతున్నారు.