శ్రీకాకుళంలో చంద్రబాబుకు తలనొప్పిగా ఆ నేత..బాబు నిర్ణయాన్ని వ్యతిరేకించింది అందుకేనా?
ఏపీ సీఎం చంద్రబాబుకు శ్రీకాకుళం జిల్లాలో ఆ నేత తీరు తలనొప్పిగా మారిందా? ఒక పక్క రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తున్న చంద్రబాబుకు సొంతపార్టీ నేత షాక్ ఇవ్వనున్నారా ? అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా కొండ్రు మురళి మూడు రాజధానుల ప్రకటనను సమర్ధించటానికి కారణం అదేనా ? వైసీపీలోకి జంప్ అవ్వాలని ఆ నేత చూస్తున్నారా ? అన్నది శ్రీకాకుళం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అసలే ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇబ్బందులు పడుతున్న టీడీపీకి శ్రీకాకుళం జిల్లాలో ఆ నేత తీరు మరింత ఇబ్బందికరంగా మారింది .
కొండ్రు మురళికి సముచిత స్థానం ఇచ్చిన చంద్రబాబు
ఏపీలో గతంలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా పని చేసిన మాజీ మంత్రి కొండ్రు మురళి, గత సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు.ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన కొండ్రు మురళి... అంతకుముందు ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో వైద్య,ఆరోగ్యశాఖ మంత్రిగా వ్యవహరించారు. ఇక టీడీపీలో చేరిన ఆయనకు చంద్రబాబు సముచిత స్థానం ఇచ్చారు.
ప్రతిభాభారతిని కాదని రాజాం టికెట్ .. ఓటమితో పార్టీకి దూరంగా ఉన్న మురళి
మాజీ స్పీకర్ ప్రతిభా భారతిని కాదని రాజాం టికెట్ ఇచ్చారు . అయినా ఆయన ఓటమి పాలయ్యారు.శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజకవర్గానికి కొండ్రు మురళి ప్రాతినిధ్యం వహిస్తున్నా కానీ ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఏ మాత్రం భాగస్వామ్యం తీసుకోవటం లేదు. ఆ తర్వాత నుండి ఆయన పార్టీకి అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారని టాక్. ఆ తర్వాత ఏపీలో టీడీపీ అధికారం పోగొట్టుకోవటంతో పక్క చూపులు చూస్తున్న నేతల తీరు తాజాగా వెలుగులోకి వస్తుంది. ఆ కోవలోనే టీడీపీకి గుడ్ బై చెప్పలనుకుంటున్నారు కొండ్రు మురళి .
జగన్ మూడు రాజధానుల ప్రకటనను స్వాగతించిన మురళి
ఏపీ సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చంద్రబాబు వ్యతిరేకిస్తే , రాజధాని అమరావతి మాత్రమే అని తేల్చి చెప్తే మాజీమంత్రి కొండ్రు మురళి మాత్రం సంపూర్ణంగా మద్దతు ప్రకటించి చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. మాజీమంత్రి కొండ్రు మురళి ఈ విషయంలో చంద్రబాబును తాము ఒప్పిస్తామని వ్యాఖ్యానించారు. తమకు పార్టీ కంటే ప్రాంతమే ముఖ్యమని ఆయన చేసిన వ్యాఖ్యలపై టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
మురళి పార్టీ మారితే ఆ ప్రభావం పార్టీ పై ... టీడీపీలో అంతర్గత చర్చ
తాజాగా విశాఖను ఏపీ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ చేయాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని కొండ్రు మురళి బలంగా సమర్థిస్తుండటంతో ఆయన చంద్రబాబుకు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మురళి చేసిన వ్యాఖ్యలకు కారణాన్ని తెలుసుకోవడానికి హైకమాండ్ ప్రయత్నిస్తోంది. ఇక దీంతో ఆయన త్వరలోనే వైసీపీ గూటికి చేరడం ఖాయమనే టాక్ టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన కొండ్రు మురళి వైసీపీలోకి వెళతారు అన్న చర్చ స్థానికంగా ఊపందుకుంది. స్థానికంగా రాజకీయంగా పట్టున్న నేత కావటంతో ఆయన పార్టీ మారితే ఆ ప్రభావం టీడీపీలో ఎలా ఉంటుందో అన్న చర్చ జరుగుతుంది.