Srikakulam: మంటల్లో చిక్కుకున్న టూరిస్ట్ బస్సు: కట్టుబట్టలతో నడిరోడ్డుపై.. !
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పర్యటక బస్సు మంటల్లో చిక్కుకుంది. పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ సకాలంలో అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో సుమారు పదిమంది గాయపడ్డారు. వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ సకాలంలో అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియ రావాల్సి ఉంది.
మిలటరీ స్కూలుపై విరచుకుపడ్డ క్షిపణులు: 28 మందికి పైగా దుర్మరణం.. !
ఉత్తరాఖండ్ కు చెందిన పర్యటక బస్సు అది. సుమారు 45 మంది ప్రయాణికులు కొద్దిరోజుల కిందట దక్షిణ భారత దేశ యాత్రకు బయలుదేరారు. పశ్చిమ బెంగాల్ మీదుగా ఒడిశాకు చేరుకున్నారు. ఒడిశాలోని పూరీలో వెలిసిన ప్రఖ్యాత జగన్నాథ స్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం శనివారం రాత్రి మన రాష్ట్రానికి బయలు దేరారు. షెడ్యూల్ ప్రకారం.. మన రాష్ట్రంలోని కొన్ని పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలను సందర్శించాల్సి ఉంది.
వైకుంఠ ఏకాదిశ సందర్భంగా సోమవారం తెల్లవారుజాము నాటికి తిరుమలకు చేరుకోవాల్సి ఉంది. పూరీ నుంచి బయలుదేరిన పర్యాటక బస్సు ఈ తెల్లవారు జామున మన రాష్ట్రంలోకి ప్రవేశించింది. శ్రీకాకుళం జిల్లాలోని పైడి భీమవర వద్ద జాతీయ రహదారిపై ఈ తెల్లవారు జామున ప్రమాదానికి గురైంది. మంటల బారిన పడింది. ఇంజిన్ నుంచి తొలుత దట్టంగా పొగ అలముకుంది. దీనితో అప్రమత్తమైన డ్రైవర్.. పర్యాటకులందర్నీ కిందికి దింపేశారు.
ఆ వెంటనే అగ్ని కీలలు చెలరేగాయి. క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించాయి. బస్సు మొత్తం దగ్ధమైంది. పలువురు పర్యాటకుల లగేజీ సైతం మంటల బారిన పడి బూడిద అయ్యాయి. వారంతా కట్టుబట్టలతో రోడ్డు మీద నిల్చోవాల్సిన దుస్థితి ఎదరైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బస్సు మొత్తం దగ్ధమైంది.
ప్రమాదానికి గల కారణాలు తెలియ రాలేదు. ఇంజిన్ లో లోపాలు లేదా ఏసీ యంత్రంలో తలెత్తిన సాంకేతిక పరమైన ఇబ్బందుల వల్లే మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో 10 మంది పర్యాటకులు స్వల్పంగా గాయపడ్డారు. వారిని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ లోని బస్సు యాజమాన్యానికి సమాచారాన్ని ఇచ్చారు స్థానిక పోలీసులు. ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.