పుట్టగొడుగుల కోసం వైసీపీ కార్యకర్త దారుణ హత్య .. శ్రీకాకుళం జిల్లా కుంటిభద్రలో ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఆందోళనకు గురి చేస్తున్నాయి . గ్రామాల్లో పార్టీల శ్రేణులు సంయమనం కోల్పోయి దాడులకు పాల్పడుతున్నారు.చిన్న చిన్న కారణాలకే గ్రామాల్లో యుద్ధ వాతావరణం నెలకొంటుంది. దాడులు చేసుకునేంత పెద్ద కారణాలు లేకున్నా గొడవలకు దిగుతున్నార. తన్నుకు చస్తున్నారు. ఎన్నికల నేపధ్యంలో మొదలైన ఘర్షణలు ఎన్నికలు ముగిసాక కూడా రావణ కాష్టంలా రాష్ట్రాన్ని దహిస్తూనే ఉన్నాయి.
పాత్రికేయుడి దారుణ హత్య: ఆటవిక చర్యంటూ పవన్ కళ్యాణ్ ఆగ్రహం
కుంటి భద్ర గ్రామంలో పుట్టగొడుగుల కోసం ఘర్షణ
ఏపీలో గత ఎన్నికల తర్వాత నుండి హింస రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. టిడిపి కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, హత్యా యత్నాలు చేయడం, హత్యలు చేయడం రివాజుగా మారిపోయింది. తాజాగా శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం లోని కుంటి భద్ర గ్రామం లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పుట్టగొడుగుల కోసం టిడిపి వైసిపి వర్గాల మధ్య జరిగిన ఘర్షణ వైసీపీ కార్యకర్త హత్యకు దారి తీసింది.
బల్లెంతో పొడిచి వైసీపీ కార్యకర్త దారుణ హత్య
పుట్టగొడుగుల విషయంలో తలెత్తిన చిన్న వివాదం చిలికి చిలికి గాలివాన అయింది. గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల మధ్య ఘర్షణ ప్రాణాలు తీసే దాకా వెళ్లింది.ఇరు వర్గాలు బల్లేలు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోకొవ్వాడ యర్రయ్య అనే వ్యక్తి హిమగిరి, కామక జంగంలపై బల్లెంతో దాడిచేశాడు.అతని కడుపులో బల్లెంతో పొడిచాడు . దాడిలో జంగం తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వెంటనే అతడిని పాలకొండ ఆసుపత్రికి తరలించారు. అయినా లాభం లేకపోయింది.
టీడీపీ కార్యకర్తలే దాడి చేశారని వైసీపీ శ్రేణుల ఆగ్రహం
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జంగం మృతి చెందాడు. ఇక ఈ దాడిలో మృతిచెందిన జంగం ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరినట్టు గ్రామస్థులు చెబుతున్నారు. దాడికి పాల్పడిన వారు పరారీలో ఉన్నారు. అతడిపై దాడిచేసింది టీడీపీ వర్గీయులేనన్న ప్రచారం జరగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.గ్రామంలో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీ బలగాలను రంగంలోకి దించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసుల ప్రయత్నం చేస్తున్నారు.
గ్రామంలో ఉద్రిక్తత .. 144 సెక్షన్
గ్రామంలో 144 సెక్షన్ విధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అల్లర్లు జరగకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ దారుణ సంఘటనపై వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి డిజిపికి ఫిర్యాదు చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిజిపిని కోరారు. ఇక ఈ దాడిలో జంగం మృతిచెందగా,మరో నలుగురు వైసీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.