ఎంసెట్ 2లో తేడా ఎక్కడొచ్చింది?: తీగ లాగుతున్న సీఐడీ, భారీ ఒప్పందం
హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకైనట్లు సిఐడి నిర్ధారించింది. ఈ కేసుకు సంబంధించి సిఐడి అధికారులు ముగ్గురు కీలక నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మొత్తం ఐదుగురు ఉన్నట్లు గుర్తించారు. ఈ విచారణ ద్వారా ప్రశ్నాపత్రం లీకైనట్లు సిఐడి అధికారులు నిర్ధారించారు. పోలీసుల కస్టడీలో ఉన్న వారు.. రాజగోపాల్ రెడ్డి, విష్ణు, తిరుమల్ రెడ్డిగా తెలుస్తోంది. రమేష్ కీలక నిందితుడని, అతను పరారీలో ఉన్నాడని తెలుస్తోంది.
ప్రశ్నాపత్రం లీకేజీ ద్వారా ముప్పై మంది విద్యార్థులు లబ్ధి పొందినట్లుగా గుర్తించారు. అరవై మందిని అనుమానించగా, 30 మంది లబ్ధి పొందినట్లు తేలింది. మిగిలిన ఇద్దరు కీలక నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రశ్నాపత్రం ఢిల్లీలోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీకైందని గుర్తించారు. విద్యార్థులను రెండు రోజుల ముందు ముంబై, బెంగళూరు తీసుకెళ్లి ప్రశ్నాపత్రం ఇచ్చినట్లు గుర్తించారు.
ఒక్కో విద్యార్థి నుంచి రూ.50లక్షల వరకు నిందితులు ఒప్పందం చేసుకున్నారు. విద్యార్థుల నుంచి రూ.10 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నారు. కీలక నిందితులు 2012లో పీజీ వైద్య విద్య ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ చేసినట్లుగా గుర్తించారు. కాగా, ఎంసెట్ 1లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు, ఎంసెట్ 2లో ఎక్కువ మార్కులు సాధించారు. దీంతో అనుమానం వచ్చి, విచారణ జరపగా, విషయం తెలిసిందే.
పరీక్షలో ర్యాంకు, కాలేజీలో సీటు పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులతో పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకుని కొందరి నుంచి అడ్వాన్సు తీసుకోవడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. లీకేజీ కేసులో దర్యాప్తు ప్రారంభించిన సీఐడీ మొత్తం డొంక కదిలించే పనిలో పడింది.
లీకేజీ కేసులో అనుమానితులను సీఐడీ అధికారులు మంగళవారం హైదరాబాద్కు పిలిపించుకుని విచారించారు. విచారణ కోసం వెళ్లిన వారిలో వరంగల్ జిల్లా పరకాల సబ్ డివిజన్లోని భూపాలపల్లికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.
కాగా, పేపర్ లీకేజీ కేసులో మొదట్లో తెరపైకి వచ్చిన మధ్యవర్తి వెంకట్రావ్కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదని సీఐడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఆయన పాత్ర నిర్థారణ కాలేదన్నారు.
అయితే, రమేశ్, దయాకర్, విష్ణు అనే మధ్యవర్తుల పేర్లతోపాటు కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు కుమార్ పేరు కొత్తగా వెలుగులోకి వచ్చాయి. విద్యార్థుల తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపిన మధ్యవర్తుల్లో కొందరు ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన వారు ఉన్నట్లు గుర్తించిన దర్యాప్తు అధికారులు అక్కడికు వెళ్లారని తెలుస్తోంది.