10.18లక్షలు బ్లాక్మనీ పట్టివేత: మెడికల్ షాపు యజమాని అరెస్ట్
నల్గొండ జిల్లా కేంద్రంలో భారీగా నల్లధనం వెలుగుచూసింది. దేవరకొండ రోడ్డు ప్రాంతంలో ఉన్న రవి మందుల దుకాణం యజమాని రాందాసు ఇంట్లో రూ.10.18లక్షల నల్లధనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: నల్గొండ జిల్లా కేంద్రంలో భారీగా నల్లధనం వెలుగుచూసింది. దేవరకొండ రోడ్డు ప్రాంతంలో ఉన్న రవి మందుల దుకాణం యజమాని రాందాసు ఇంట్లో రూ.10.18లక్షల నల్లధనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇంటిని సోదా చేసిన పోలీసులకు రూ.6.16లక్షల పాత వెయ్యి, ఐదువంద రూపాయల నోట్లు, రూ.4.2లక్షల విలువైన కొత్త రెండు వేల రూపాయల నోట్లు దొరికాయి. రాందాసును అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మాసబ్ ట్యాంక్ కాల్పులు: ముగ్గురు నిందితుల అరెస్ట్
హైదరాబాద్: మాసబ్ట్యాంక్లో నివాసముంటున్న కేబీఎస్ బ్యాంక్ సీఎండీపై కాల్పులు జరిపిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ప్రధాన నిందితుడు నరేష్ తోపాటు మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. డబ్బుల కోసమే నిందితులు ఈ దోపిడీకి యత్నించినట్లు చెప్పారు. బాధితుడి డ్రైవర్ సహకారంతో నిందితులు సీఎండీకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే వారని చెప్పారు.
ముగ్గురు నిందితులను మూడు రాష్ట్రాల్లో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులు రాజమండ్రికి చెందినవారని, టీ షాపు నిర్వహిస్తుండేవారని చెప్పారు. నిందితులు బీహార్ నుంచి తుపాకీ తెప్పించుకున్నారని చెప్పారు.