చర్లపల్లి జైలులో భానుకిరణ్ వద్ద మందు బాటిల్స్ లభ్యం
హైదరాబాద్: నగరంలోని నాంపల్లి కోర్టుకు చెందిన 120 మంది జీవిత ఖైదులను చర్లపల్లి నుంచి చంచల్గూడకు తరలించున్నారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి సెంట్రల్ జైలులో పోలీసు ఉన్నతాధికారులు తనిఖీలను నిర్వహించారు.
ఈ తనిఖీల్లో ఖైదీల వద్ద మద్యం బాటిల్స్ లభ్యమయ్యాయి. జైల్లోని మానస బ్యారక్లో 10 మందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ బాటిళ్లను రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్దెలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన భానుకిరణ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయాన్ని జైలు అధికారులు కూడా ధ్రువీకరించారు. అయితే అతనికి మద్యం బాటిళ్లు ఎవరు సరఫరా చేశారన్న విషయంపై విచారణ జరుగుతోంది. జైలులో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న సిబ్బందిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, 120 మంది ఖైదీలను చర్లపల్లి నుంచి చంచల్గూడ జైలుకు తరలించనున్నట్లు జైళ్లశాఖ డీజీ వినయ్కుమార్ సింగ్ ఆదేశాలు జారీచేశారు. చంచల్గూడ్లో నూతన పరిశ్రమ, పెట్రోల్ బంక్లను ప్రారంభిస్తున్న దృష్ట్యా ఖైదీల తరలింపును చేపట్టినట్లు ఆయన తెలిపారు. వారం లేదా పదిరోజుల్లో ఖైదీలను చంచల్గూడకు తరలిస్తామని ఆయన పేర్కొన్నారు.