కరోనా రోగుల పరారీ?: రిమ్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు, ఏం జరుగుతోందంటే.?
ఆదిలాబాద్: రిమ్స్ కరోనా వార్డు నుంచి పది మంది రోగులు పరారైన ఘటన కలకలం రేపుతోంది. రిమ్స్ కరోనా వార్డు నుంచి ముగ్గురు కరోనా రోగులు, ఐసోలేషన్ వార్డు నుంచి ఏడుగురు రోగులు పరారైనట్లు సమాచారం. అయితే, ఆస్పత్రి వర్గాలు మాత్రం కరోనా రోగులు ఎవ్వరూ కూడా పారిపోలేదని చెబుతున్నారు.
Recommended Video
కరోనా బారిన పడిన తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్: హోం ఐసోలేషన్
సమాచార లోపం వల్లే..
రిమ్స్ డైరెక్టర్ బలరాం నాయక్ ఈ విషయంపై మీడియాతో మాట్లాడుతూ.. సమాచార లోపం వల్లే ఇలా జరిగిందని, నలుగురు సభ్యులతో కూడిన కమిటీ వేశామని చెప్పారు. లోపాలు జరిగితే చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. కాగా, స్థానిక రాజకీయ నేతల జోక్యంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్థానిక రాజకీయ నేతల జోక్యంతో..
రిమ్స్లో వైద్య ఖాళీల భర్తీని స్థానిక నాయకులు చేయొద్దంటున్నారని, అందుకే ఇక్కడ ఖాళీల భర్తీ కావడం లేదన్నారు. దీంతో ఉన్న సౌకర్యాలతోనే వందశాతం పనిచేస్తున్నామని రిమ్స్ డైరెక్టర్ తెలిపారు. కొంతమంది వైద్యుల పోస్టుల కోసం రాజకీయ నేతల రిక్రూట్మెంట్లు ఆపేయమంటున్నారని, ఇదే విషయాన్ని జిల్లా
అధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఖాళీలు భర్తీ చేయడంలో ప్రస్తుతం ఉన్న వారే ఒప్పుకోవడం లేదని, తన సీటు తన పోస్టు అంటున్నారని.. వీరికి స్థానిక రాజకీయ నేతలు మద్దతుగా ఉంటున్నారని చెప్పారు. కాగా, ఈ పరిణామాల మీద డీఎంఅండ్ హెచ్ఓ విచారణ చేపట్టారు.
పారిపోయిన రోగుల గుర్తింపు.. కానీ..
కాగా, రిమ్స్ నుంచి పారిపోయిన వారిని గుర్తించామని, అందులో ముగ్గురిని ఇప్పటికే రిమ్స్ కు తరలించామని చెప్పారు. ఇంకా ఇద్దరి అడ్రస్ ల కోసం వెతుకుతున్నామని తెలిపారు. రిమ్స్లో లోపం ఎక్కడ జరిగిందనేదానిపై విచారణ జరుపుతున్నాయని చెప్పారు. కాగా, కరోనా రోగులు తప్పించుకుపోయారన్న వార్త స్థానికంగా కలకలంగా మారింది. వారు ఎవరెవరిని కలిశారనేది ఆందోళనకరంగా మారింది.
తెలంగాణలో పెరుగుతున్న కేసులు
ఇక తెలంగాణలో శనివారం 1891 కొత్త కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 66,677కు చేరింది. ప్రస్తుతం రాస్ట్రంలో 18,547 యాక్టివ్ కేసులున్నాయి. గత 24గంటల్లో 1088 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 47,590గా ఉంది. శనివారం కరోనాతో 10 మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 540కి చేరింది.