చరిత్రలో నిలిచిపోయేలా మోడీ సభ: బండి సంజయ్, కేసీఆర్ను పట్టించుకోమంటూ ఫైర్
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ సభను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని, 10 లక్షలకుపైగా ప్రజలు ఈ సభకు వస్తారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. జులై 3న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారతీయ జనతా పార్టీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు సంబంధించిన పనులను బండి సంజయ్ ఆదివారం పర్యవేక్షించారు. ఈ క్రమంలోనే భూమి పూజ నిర్వహించి.. సభ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

10 లక్షల మందితో చరిత్రలో నిలిచిపోయేలా మోడీ సభ: సంజయ్
జులై 3న సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తామని, అందుకోసం భూమి పూజ నిర్వహించామని తెలిపారు బండి సంజయ్. రాష్ట్రంలో బీజేపీ పాలసీ ప్రకటించడానికి, ప్రజలను చైతన్యం చేయడానికే ఈ సభ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తుక్కుగూడలో అమిత్ షా, పాలమూరులో జేపీ నడ్డాల సభ చూసిన ప్రజలు.. ఇప్పుడు పరేడ్ గ్రౌండ్లో ప్రధాని నరేంద్ర మోడీ సభ చూస్తారని బండి సంజయ్ పేర్కొన్నారు. దాదాపు 10 లక్షల మందిని సభకు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంజయ్ పేర్కొన్నారు. ఇందుకోసం ఇప్పటికే పోలింగ్ బూత్, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులతో సమావేశాలు నిర్వహించినట్లు సంజయ్ తెలిపారు. కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. ఈ సభ చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందన్నారు.

ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ: కేసీఆర్పై బండి సంజయ్ ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోసం బీజేపీ పని చేస్తుందని బండి సంజయ్ తెలిపారు. తమ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా బీజేపీని కట్టడి చేయాలి, ఇబ్బంది పెట్టాలని సీఎంవో కార్యాలయంలో ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారన్నారు బండి సంజయ్. ప్రజలే పట్టించుకోవడం మానేసిన సీఎం కేసీఆర్ గురించి తమ పార్టీ పట్టించుకోదన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లు సీఎం కేసీఆర్ పరిస్థితి తయారయ్యిందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

హైదరాబాద్కు తరలిరానున్న బీజేపీ జాతీయ అగ్రనేతలు
కాగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలు జులై 2, 3 తేదీల్లో నగరంలో జరగనున్నాయి. బీజేపీ జాతీయస్థాయి అగ్రనేతలందరూ హాజరయ్యే ఈ సమావేశాలకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. తుది సన్నాహాలపై సమీక్షించేందుకు బీజేపీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జి తరుణ్ చుగ్, ఇతర నేతలు హైదరాబాద్ చేరుకుంటున్నారు.
కాగా, ఈ సమావేశాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాఅధ్యక్షత వహించనున్నారు. నడ్డా జులై 1నే హైదరాబాద్ చేరుకోనున్నారు. కాగా, శంషాబాద్ విమానాశ్రయం నుంచి సమావేశాలకు వేదికగా నిలుస్తున్న నోవాటెల్ వరకు భారీ ర్యాలీతో నడ్డాకు స్వాగతం పలకాలని తెలంగాణ బీజేపీ నేతలు నిర్ణయించారు. అదే రోజున సాయంత్రం నడ్డా అధ్యక్షతన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరుగుతుంది. జులై 2న ఉదయం బీజేపీ పదాధికారుల సమావేశం ఉంటుంది. సాయంత్రం 4 గంటల నుంచి జులై 3వ తేదీ సాయంత్రం 5 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతాయి. జులై 3వ తేదీ సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్లో ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ ఉంటుంది.