షాకింగ్ : 9 కాదు.. 10 హత్యలు.. గొర్రెకుంట హత్యల కేసులో మరో నిజం వెలుగులోకి..
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని గన్నీ సంచుల గోదాం ఆవరణలో ఉన్న బావిలో వెలుగుచూసిన 9 మృతదేహాలకు సంబంధించి ఒక్కొక్కటిగా మిస్టరీ వీడుతోంది. మక్సూద్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న సంజయ్ కుమార్ అనే బీహారీ యువకుడే ఈ హత్యలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.
అయితే మక్సూద్ కూతురు బుష్రాతో వివాహేతర సంబంధమే హత్యలకు కారణమా.. లేక సంజయ్ విచారణలో వెల్లడించినట్టు మక్సూద్ అల్లుడి డైరెక్షన్ మేరకే హత్యలు జరిగాయా.. అన్నది తేలాల్సి ఉంది. పోలీసులు ఈ కోణంలో విచారణ జరుపుతుండగానే మరో నిజం బయటపడింది.
మరో నిజం వెలుగులోకి...
మక్సూద్ మరదలు చోటీని కూడా సంజయ్ గతంలో హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. మూడు నెలల క్రితం సంజయ్ ఆమెను రైలు నుంచి తోసేసి చంపినట్టు నిర్దారించారు. చోటీతో సంజయ్ సహజీవనం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇద్దరి మధ్య విభేదాల కారణంగా హత్యకు పాల్పడినట్టు సమాచారం. అయితే చోటీ గురించి మక్సూద్ పదేపదే ఆరా తీయడంతో సంజయ్ భయపడినట్టు తెలుస్తోంది.
మక్సూద్ చోటీ కనిపించట్లేదని ఎక్కడ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడోనన్న భయంతో అతని కుటుంబం మొత్తాన్ని హత్య చేసినట్టుగా తెలుస్తోంది. సంజయ్కి మక్సూద్ కూతురు బుష్రాతోనూ వివాహేతర సంబంధం ఉన్నట్టు గుర్తించారు. అయితే బుష్రా మరొకరితో సాన్నిహిత్యంగా ఉంటుందన్న కారణంతో ఆమెపై కక్ష పెంచుకున్నట్టు తెలుస్తోంది. అటు చోటీ విషయంలో ఎక్కడ దొరికిపోతానేమోనన్న భయం.. బుష్రా తనకు కాకుండా పోతుందన్న అక్కసుతోనే మక్సూద్ కుటుంబం మొత్తాన్ని సంజయ్ మట్టుపెట్టినట్టుగా తెలుస్తోంది.
మొత్తం 10 హత్యలు..
నిన్నటిదాకా సంజయ్ 9 మందిని హత్య చేసినట్టు అంతా భావించారు. తాజాగా చోటీ వ్యవహారం కూడా వెలుగుచూడటంతో సంజయ్ హత్యల సంఖ్య 10కి చేరింది. పోలీసుల విచారణలో సంజయ్ మరో షాకింగ్ విషయాన్ని కూడా వెల్లడించాడు. హత్యలు ఎలా చేయాలని యూట్యూబ్లో పలు వీడియోలు సెర్చ్ చేసి చూసినట్టు చెప్పాడు.
ఆ వీడియోల స్పూర్తితోనే హత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. సంజయ్ హత్యలకు అతని స్నేహితులు యాకూబ్,అంకూస్లు సహకరించారు. నిజానికి మక్సూద్ పొరుగునే ఉండే బీహారీ యువకులు శ్యాం కుమార్షా(21), శ్రీరాం కుమార్షా(26) లను వదిలేద్దామని భావించానని.. కానీ వారి ద్వారా ఎక్కడ హత్యల విషయం వెలుగుచూస్తుందోనని వారిని కూడా హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు.
Recommended Video
అల్లుడి డైరెక్షనేనా..
మరోవైపు సంజయ్ మరో వాదనను కూడా తెరపైకి తెచ్చాడు. ఢిల్లీలో ఉన్న మక్సూద్ అల్లుడి డైరెక్షన్ మేరకే అతని కుటుంబాన్ని మట్టుబెట్టినట్టు చెప్పాడు. అయితే ఆ అల్లుడు బుష్రా భర్తేనా అన్నది తేలాల్సి ఉంది. బుష్రా భర్తతో విడిపోయి కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటోంది. ఆమె మూడేళ్ల కుమారుడి బర్త్ డే పార్టీలోనే సంజయ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అందరికీ కూల్ డ్రింక్స్లో నిద్రమాత్రలు కలిపి తాగించినట్టు విచారణలో ఒప్పుకున్నాడు. అంతా అపస్మారక స్థితిలోకి చేరుకున్నాక.. గోనె సంచుల్లో చుట్టి బావిలో పడేసినట్టు చెప్పాడు.