'పచ్చ కామెర్లు' తో బాధపడుతోన్న మెదక్ జిల్లాలోని ఓ గ్రామం
హైదరాబాద్: మెదక్ జిల్లా దుబ్బాక మండలం చిన్ననిజాంపేట గ్రామం పచ్చకామెర్లతో బాధపడుతోంది. గ్రామంలో సుమారు 250 వరకు కుటుంబాలు ఉన్నాయి. గ్రామ జనాభాలో సగం మందికి పైగా పచ్చ కామెర్ల వ్యాధికి గురై, అస్వస్థతకు లోనయ్యారు.
ప్రతి ఇంట్లో కూడా కనీసం ఒకరైనా ఈ వ్యాధికి గురయ్యారు. కొన్ని ఇళ్లలో మొత్తం కుటుంబసభ్యులు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఊరు జనమంతా ఈ వ్యాధితో బాధపడుతుంటే పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.
గ్రామంలో ఆరోగ్య సేవలు అందుబాటులో లేకపోవడంతో, చికిత్స కోసం సమీపంలోని భూంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళుతున్నారు. అయితే, అక్కడ కూడా డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో అర్ధం కావడం లేదని బాధితులు వాపోతున్నారు.
భర్తను హతమార్చిన భార్య, కొడుకు
కుటుంబ కలహాలతో భర్తను హతమార్చారు భార్య, కొడుకు. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. జిల్లాలోని మధిర పట్టణంలోని ఎస్సీ కాలనీలో కుటుంబ కలహాలతో భర్త ప్రకాష్ను భార్య, కొడుకులు కలిసి రోకలిబండతో కొట్టి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గోదావరిఖనిలో మహిళపై అత్యాచారయత్నం
గోదావరిఖని పట్టణంలోని జీఎం కాలనీలో ఓ మహిళపై ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. దీంతో స్థానికులు నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.