కరోనా కల్లోలం: తెలంగాణలో 17వేలు దాటిన కేసులు, మరో ఏడు మరణాలు, జిల్లాల వారీగా..
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 17,357కు చేరింది.
కరోనా పరీక్షలు ఎలా నిలిపేస్తారు? బులిటెన్లలో వివరాలేవీ?: హైకోర్టు ఆగ్రహం, ఆన్లైన్ క్లాసులపైనా..
బుధవారం కరోనాతో మరో ఏడుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 267కి చేరింది. కాగా, బుధవారం 778 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9008 యాక్టివ్ కేసులున్నాయి.
కాగా, తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా ఉన్నాయి. 1018లో జీహెచ్ఎంసీ పరిధిలో 881 కరోనా కేసులున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 33, మేడ్చల్లో 36 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డిలో 2, కరీంనగర్ లో 2, మహబూబ్ నగర్లో 10, గద్వాల్లో 1, సూర్యపేటలో 2, ఖమ్మంలో 7, కామారెడ్డిలో 2, నల్గొండలో 4, సిద్దిపేటలో 3, ములుగులో 2, వరంగల్ రూరల్లో 9, జగిత్యాలలో 4, మంచిర్యాలలో 9, అసిఫాబాద్ 2, మెదక్ 2, ఆదిలాబాద్ 2, యాదాద్రిలో 2, నిజామాబాద్లో 3కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇక దేశ వ్యాప్తంగా కూడా కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. దేశంలో బుధవారం వరకు 6,03,051 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2,26,739 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో ఇప్పటి వరకు 3,58,453 మంది కోలుకున్నారు. 17,793 మంది కరోనా బారినపడి మృతి చెందారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1,80,298 కరోనా కేసులు నమోదు కాగా, తమిళనాడులో 94,049 కేసులున్నాయి. ఢిల్లీలో 89,802, గుజరాత్ రాష్ట్రంలో 32,643 కేసులు నమోదయ్యాయి.