ఉధృతమవుతున్న ఆర్టీసీ సమ్మె .. 10వ రోజు బస్టాండ్ ల ముందే బహిరంగ సభలతో నిరసన
ఆర్టీసీ కార్మికుల సమ్మె 10వ రోజు కొనసాగుతోంది. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె పదవ రోజుకి చేరుకున్నా ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికుల గురించి ఏమాత్రం ఆలోచించటంలేదు . ఒకపక్క ఆత్మబలిదానాలతో ఆర్టీసీ కార్మికుల కుటుంబాల్లో మరణ మృదంగం మోగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు . తెలంగాణ రాష్ట్రంలో సమస్యల పరిష్కారం కోసం, ఆర్టీసీని విలీనం చేయాలన్న డిమాండ్ తో పదో రోజు కూడా పలు జిల్లాల వ్యాప్తంగా బంద్ చేపట్టారు ఆర్టీసీ కార్మికులు.
హరీష్ వైపు ఆర్టీసీ కార్మికులు చూపు: రంగంలోకి దిగని ట్రబుల్ షూటర్: అడ్డుకుంటుందెవరు..!
ఆదివారం వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించిన కార్మికులు ఇద్దరు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం ససేమిరా అనడంతో కార్మికులు సమ్మెను మరింత ఉదృతం చేశారు. ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోని పరభుత్వ తీరుతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. దీనికి నిరసనగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో నిరసన తెలుపనున్నట్లు కార్మికులు తెలిపారు. ఈ రోజు కార్యాచరణలో భాగంగా ఆర్టీసీ బస్ స్టాండ్ ల ముందు బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు.
ఉదయం నుంచే బస్ స్టాండ్ ల వద్ద బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్ల ఆత్మహత్యలకు నిరసనగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల వ్యాప్తంగా బంద్ పాటిస్తున్నారు. కార్మికుల బంద్కు ప్రజలు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. దీంతో కేసీఆర్ ప్రభుత్వం ఒంటరి అవుతోంది. నేటి నుంచి మంత్రుల్ని కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు.
సమ్మె ఉధృతం అవుతున్నా, అందరూ ముక్త కంఠంతో ఆర్టీసీ కారమికుల పట్ల ఉదారత చూపించాలని సీఎం కేసీఆర్ ను కోరినా ఫలితం మాత్రం శూన్యం. ఏది ఏమైనప్పటికీ విభిన్న రూపాల్లో తమ నిరసన తెలియ చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించటం లేదు. అంతే కాదు కార్మికులు ప్రాణాలు తీసుకుంటున్నా కనికరం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు సీఎం కేసీఆర్ . దీంతో మరింత ఉదృతంగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టి సీఎం కేసీఆర్ కు చుక్కలు చూపించే ఆలోచనలో ఉన్నారు. ఇక దీనికోసం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు సైతం మద్దతు ప్రకటిస్తూ ఆర్టీసీ కార్మికులకు బాసటగా నిలుస్తున్నాయి.