ఇంటర్ మంట ఆరనేలేదు.. అప్పుడే 10th పెంట మొదలైందా ? తెలంగాణలో అసలేం జరుగుతోంది ?
వరంగల్/హైదరాబాద్ : ఇంటర్ ఫలితాలు రేపిన చిచ్చు పూర్తిగా చల్లారక ముందే పదవ తరగతి రీవాల్యుయేషన్ మరో వివాదానికి తెరలేపబోతోతంది. అర్హతలేని ఉపాద్యాయులతో టెన్త్ పరీక్షా పేపర్లను దిద్దిస్తూ ఖాజీపేటలో విద్యాశాఖ అదికారులు దొరికిపోయారు. దీంతో పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రలు పెద్ద యెత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఖాజీపేటలోనే ఇలా జరుగుతుందా లేక తెలంగాణ వ్యాప్తంగా ఇలా జరుగుతుందా అనే కోణంలో దర్పాప్తు జరపాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
టెన్త్ మూల్యాంకనంలో అనర్హులు..! మండిపడుతున్న తల్లిదండ్రులు..!!
ఒకవైపు ఇంటర్మీడియేట్ పరీక్ష పత్రాల మూల్యాంకనం (వాల్యుయేషన్)లో అవకతవకలపై విద్యార్థులు గగ్గోలు పెడుతుంటే.. మరోవైపు పదో తరగతి మూల్యాంకనంలో చోటుచేసుకున్న విస్తుగొలిపే విషయం తెలిసింది. ఒక కేంద్రంలో మూల్యాంకనంలో జరిగిన తప్పిదాన్ని గుర్తించి, శుక్రవారం అక్కడే 523 జవాబు పత్రాలను పునర్మూల్యాంకనం (రీ-వాల్యుయేషన్) చేయించారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విశయం బహిర్గతం..! 5 రోజుల తర్వాత దిద్దుబాటు చర్యలు..!!
మూల్యాంకన కేంద్రంలోనే పునర్మూల్యాంకనం వ్యవహారం వరంగల్ అర్బన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మూల్యాంకన ప్రక్రియ ఈ నెల 15 నుంచి ప్రారంభమైంది. కాజీపేటలోని ఫాతిమా హైస్కూల్ కేంద్రంగానూ వాల్యుయేషన్ జరిగింది. ఈ కేంద్రంలో అనర్హులైన ఇద్దరు ఉపాధ్యాయులు కూడా మూల్యాంకన విధులకు హాజరయ్యారు.
మరో వివాదానికి ఆజ్యం పోయనున్న సంఘటన..! హైరానా పడుతున్న అదికారులు..!!
ఈ విషయం కొన్ని ఉపాధ్యాయ సంఘాల ద్వారా క్యాంపు అధికారి, వరంగల్ అర్బన్ డీఈవో కె.నారాయణ రెడ్డికి తెలిసింది. దీంతో ఆ ఇద్దరు ఉపాధ్యాయులను 20న మూల్యాంకన విధుల నుంచి తొలగించారు. రాష్ట్ర పరిశీలకులైన వరంగల్ ఆర్జేడీ పి.రాజీవ్ అంతర్గత విచారణ చేపట్టి అనర్హులతో వాల్యుయేషన్ చేయించడం నిజమేనని గుర్తించారు.
అప్పటికే 523 పత్రాలను దిద్దిన ఇద్దరు అనర్హులు..! ఆందోళనలో తల్లిదండ్రులు..!!
అయిదు రోజుల్లో ఆ ఇద్దరు ఉపాధ్యాయులు 523 జవాబు పత్రాలు దిద్దారు. వాటిని 12 మంది ఏఈలతో వాల్యుయేషన్ చివరి రోజు శుక్రవారం మళ్లీ ప్రత్యేకంగా దిద్దించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే ఇంటర్లో అస్తవ్యస్త వాల్యుయేషన్పై రాష్ట్రంలోని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటే కాజీపేట ఘటన చర్చనీయాంశమైంది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.