రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు: కడియం, 'తెలంగాణ ఎక్స్ప్రెస్'గా మారిన ఏపీ ఎక్స్ప్రెస్
హైదరాబాద్: పదవ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విడదలు చేశారు. ఫలితాల విడుదల అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్పై మాట్లాడారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి విద్యార్ధులు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చని తెలిపారు.
ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కు సంబంధించి అంశం కోర్టులో ఉండటం వల్లనే కౌన్సిలింగ్ ప్రక్రియ ఆలస్యమైందని చెప్పిన ఆయన, విద్యార్థుల తల్తిదండ్రులు కౌన్సెలింగ్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రేపటి నుంచి విద్యార్థులు కౌన్సెలింగ్లో పాల్గొనాలని కోరారు. జేఎన్టీయూ 225 కాలేజీలకు మాత్రమే అనుమతి ఇచ్చిందని అన్నారు.
ఈ విషయంపై ఏఐసీటీఈ నుంచి ఇద్దరు, జేఎన్టీయూ నుంచి ఒకరు, మొత్తం ముగ్గురు సభ్యుల కమిటీ ఈ నెల 28 లోపు కాలేజీల్లో తనిఖీలు చేస్తారని ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో కాలేజీలు తిరస్కరణకు గురైతే ఫీజులు రీఫండ్ చేయాల్సి ఉంటుందన్నారు. హైకోర్టు ఆర్డర్స్ను దృష్టిలో పెట్టుకుని వెబ్ ఆప్షన్లలో పాల్గొనాలని విద్యార్థులకు సూచించారు.
జేఎన్టీయూ లెటర్ ఇచ్చిన కాలేజీలకు శుక్రవారం నుంచి కౌన్సెలింగ్కు అనుమతిస్తామని తెలిపారు. 220 కాలేజీలకు గాను మొత్తం 82 వేల 795 సీట్లు వెబ్సైట్లో ఉంచుతామని చెప్పారు.
'తెలంగాణ ఎక్స్ప్రెస్'గా మారిన ఏపీ ఎక్స్ప్రెస్
హైదరాబాద్-న్యూఢిల్లీ మధ్య ప్రయాణించే ఏపీ ఎక్స్ప్రెస్ పేరుని 'తెలంగాణ ఎక్స్ప్రెస్'గా మార్చినట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. నవంబర్ 15 నుంచి మార్చిన పేరు అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఏపీ ఎక్స్ప్రెస్ పేరు తెలంగాణ ఎక్స్ప్రెస్గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే విజయవాడ నుంచి న్యూఢిల్లీల మధ్య ఏపీ ఎక్స్ప్రెస్ పేరుతో రైలును నడపడానికి దక్షిణమధ్య రైల్వే యోచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా విజయవాడ నుంచి ఢిల్లీకి కొత్తగా ఏపీ ఎక్స్ప్రెస్ రైలు నడిపే యోచనలో దక్షిణమధ్య రైల్వే ఉంది.