తమిళనాడులో ఘోర ప్రమాదం, 11 మంది తెలంగాణ అయ్యప్ప భక్తుల దుర్మరణం
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పదకొండు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరంతా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినవారు.
పుదుకోటై తిరుమయం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. అయ్యప్ప భక్తులు వెళ్తున్న టెంపో ట్రావెలర్ వ్యాన్ కంటైనర్ లారీని ఢీకొట్టింది. రామేశ్వరం నుంచి శబరిమల వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
మృతదేహాలను తెలంగాణకు పంపించేందుకు తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మృతులను మహేష్, కుమార్, నాగరాజు, శ్యామ్, ప్రవీణ్, కృష్ణ, సాయి, ఆంజనేయులు, సురేష్లుగా గుర్తించారు. వ్యాన్ డ్రైవర్ కూడా ఉన్నారు.
వెంకటేశ్వర్లు, నరేష్, రాజీ, భూమా గోల్డ్, శ్రీశైలం అనే భక్తులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దుర్మరణం చెందినవారంతా మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేటవాసులు. ప్రమాదం జరిగినప్పుడు వ్యాన్లో 16 మంది భక్తులు ఉన్నారని తెలుస్తోంది.
ప్రమాద విషయం తెలుసుకున్న తెలంగాణ అధికారులు తమిళనాడు అధికారులతో మాట్లాడారు. మెదక్ జిల్లా కలెక్టర్ పుదుకొట్టై జిల్లా కలెక్టర్తో మాట్లాడారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.