గుడ్ న్యూస్: 11 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడు నెగిటివ్: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. లాక్ డౌన్ ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ అడపాదడపా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి శనివారం ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే.
గుడ్ న్యూస్ అంటూ కేటీఆర్..
గత మూడు రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. నిజామాబాద్లో తొలి కరోనా కేసు నమోదైంది. హైదరాబాద్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో నగర జనం కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఓ మంచి వార్త చెప్పారు.
ఆ 11 మందికి నెగిటివ్..
తెలంగాణలో గతంలో కరోనా పాజిటివ్గా నమోదైన 11 మందికి శనివారం నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ అని వచ్చిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇలాంటి సమయంలో ఇదొక మంచి పరిణామమేనని అన్నారు. నిబంధనల ప్రకారం 24 గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షల్లో రెండుసార్లు నెగిటివ్ అని నిర్ధారణ అయితే వారిని డిశ్చార్జ్ చేస్తారు.
కరోనాకు ప్రత్యేక ఆస్పత్రులు..
కరోనా వ్యాపిస్తున్న క్రమంలో హైదరాబాద్ కింగ్ కోటిలోని ఆస్పత్రిలో 350 బెడ్స్ ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లోని మరో నాలుగు ఆస్పత్రుల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు.
మోడీతో కరోనాను జయించిన యువకుడు
కాగా, తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్గా నమోదైన సికింద్రబాద్ మహేంద్ర హిల్స్ కాలనీకి చెందిన యువకుడు కూడా కరోనా నుంచి బయటపడ్డ విషయం తెలిసిందే.
మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆ యువకుడితో మాట్లాడారు. కాగా, ప్రస్తుతం భారతదేశంలోనూ కరోనా వేగంగా వ్యాపిస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యికి చేరువలో ఉంది. ఇప్పటి వరకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళ, మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా 30వేల మందికిపైగా మృతి చెందారు. ఇటలీ, అమెరికా, ఇరాన్ దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.