11మందికి ప్రాణం పోసిన అనూష, వెంకటేష్
వారిద్దరు చనిపోయారు. కానీ, వారు తమ అవయవాలను దానం చేసి మరో 11మందికి ప్రాణం పోశారు. అంటే వారిద్దరూ ఆ 11మంది రూపంలో బతికే ఉన్నారన్నమాట.
హైదరాబాద్: వారిద్దరు చనిపోయారు. కానీ, వారు తమ అవయవాలను దానం చేసి మరో 11మందికి ప్రాణం పోశారు. అంటే వారిద్దరూ ఆ 11మంది రూపంలో బతికే ఉన్నారన్నమాట. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్కు గురైన ఇద్దరు వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలతో 11మందికి ప్రాణం పోయడం ద్వారా ఇది సాధ్యమైంది.
ఆ వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాకు చెందిన అనూష(24) నగరంలోని బాచుపల్లిలో ఓ ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్గా పని చేస్తోంది. జులై 7న సోదరితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తూ జేఎన్టీయూ సమీపంలో ప్రశాంత్నగర్ కాలనీ రహదారిలో ప్రమాదానికి గురయ్యారు.
బైక్ను నడుపుతున్న సోదరి స్వల్ప గాయాలతో బయటపడగా వెనుక కూర్చున్న అనూష తలకు బలమైన గాయమైంది. ప్రథమ చికిత్స అనంతరం మలక్పేట్ యశోదాకు తరలించారు. అక్కడ వైద్య చికిత్స అందించిన వైద్యులు 10న ఆమె బ్రెయిన్డెడ్ అయిందని ప్రకటించారు.
జీవన్దాన్ ప్రతినిధులు అనూష కుటుంబసభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించి రెండు మూత్రపిండాలు, కళ్లు, కాలేయం సేకరించారు. ఆ అవయవాలను అవసరమైన వ్యక్తులకు అమర్చి వారి ప్రాణాలను నిలబెట్టారు వైద్యులు.
ఇక మరో ఘటనలో సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం గాజుల మల్కాపూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్(25) జులై 8న బైక్పై వెళుతుండగా కారు వెనుకనుంచి ఢీకొంది. దీంతో వెంకటేశ్ తలకు బలమైన గాయమైంది. ప్రాథమిక వైద్యం అందించిన తర్వాత అతడ్ని చికిత్స నిమిత్తం జులై 10న ఎల్బినగర్లోని అవేర్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స అందించిన వైద్యులు అదే రోజు వెంకటేశ్కు బ్రెయిన్ డెడ్ అయిందని ప్రకటించారు. సమాచారం అందుకున్న జీవన్దాన్ ప్రతినిధులు వెంకటేశ్ తల్లిదండ్రులకు అవగాహన కల్పించి అతని మూత్రపిండాలు, కళ్లు, కాలేయం, గుండె సేకరించారు.
రెండు ఘటనల్లో సేకరించిన అవయవాలను వివిధ ఆస్పత్రుల్లో అవసరార్థులకు అమర్చినట్లు జీవన్దాన్ ప్రతినిధి డా స్వర్ణలత తెలిపారు. వీరి అవయవ దానాలకు వారి కుటుంబసభ్యులు అంగీకరించడంతోనే మొత్తం 11మంది ప్రాణాలు నిలిచాయని తెలిపారు.