అమెరికాలో అగ్నిప్రమాదం: నిరాశ్రయులైన తెలుగు విద్యార్థులు, బూడిదైన పాస్పోర్టులు(వీడియో)
వాషింగ్టన్: అమెరికా లూసీయానాలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం తెలుగు విద్యార్థుల పట్ల శాపంగా మారింది. బాటన్ రోగ్లోని హైలాండ్ ప్లాంటేషన్ అపార్ట్మెంట్లో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో 11 మంది తెలుగు విద్యార్థుల పాస్ పోర్టులు, ఒరిజినల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లతోపాటు కీలకమైన వస్తువులు కాలిబూడిదయ్యాయి.
అయితే, ఈ ప్రమాదంలో విద్యార్థులకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అపార్టమెంట్లో ఆకస్మాత్తుగా అగ్నికీలలు ఎగిసిపడిన విషయాన్ని పసిగట్టిన విద్యార్థులు తమ గదుల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. నలుగురు విద్యార్థులు మాత్రం తమ పాస్ట్పోర్టులు, ఇతర వస్తువులు తీసుకొని బయటకు వచ్చారు.
మొత్తంగా అపార్ట్మెంట్లోని 34 మంది కట్టుబట్టలతో బయటపడ్డారు. వారి విలువైన వస్తువులన్నీ కాలిపోయాయి. వీరిలో 11మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. తెలుగు విద్యార్థులకు తెలంగాణకు చెందిన విజయ్ తుపల్లి అండగా నిలిచారు. బాధిత విద్యార్థులకు కావాల్సిన ఏర్పాట్లను విజయ్ స్వయంగా చూస్తున్నారు.
బాధిత విద్యార్థులంతా మాస్టర్ డిగ్రీ చేస్తున్నారు. బాధిత విద్యార్థులకు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, అమెరికన్ తెలుగు అసోసియేషన్, దత్త టెంపుల్ కమిటీ నిర్వాహకులతో పాటు స్థానిక ప్రజలు వారికి అన్ని విధాలా అండగా నిలిచారు.
అగ్ని ప్రమాదం జరగడంతో నిరాశ్రయులైన విద్యార్థుల్లో మహిపాల్ రెడ్డి నేరళ్లపల్లి, రాకేశ్ రెడ్డి గల్లనగరి, దివ్య గంగవరం, సంహిత దేవరపల్లి, వెంకట్ మేరువ, నిఖిత రెడ్డి పుంటికూర, శరత్ తేజ్ ఐల, ప్రత్యూష బసనీ, అభిరామ్ రెడ్డి సంగిరెడ్డి, పూర్ణ గుర్రం, నిహారిక రామ వీరేష్ ఉన్నారు. ఆపద సమయంలో అమెరికాలోని తెలుగువారు, సంఘాలు అండగా నిలవడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.