ఒకరికి 110 ఏళ్లు,మరొకరికి 103 ఏళ్లు... శతాధిక వయసులో కరోనాను జయించిన వృద్దులు...
కరోనా వేళ విషాద దృశ్యాలే కాదు... శతాధిక వయసులోనూ దాన్ని జయించి అందరిలో మానసిక స్థైర్యాన్ని నింపుతున్నవాళ్లు కూడా ఉన్నారు. తాజాగా తెలంగాణలో 110 ఏళ్ల రామానంద తీర్థ అనే వృద్దుడు, కర్ణాటకలో 103 ఏళ్ల దొరెస్వామి అనే వృద్దుడు కరోనాను జయించారు. కీసరలోని ఓ ఆశ్రమంలో ఉంటున్న రామానంద తీర్థ కరోనా సోకి గాంధీ ఆస్పత్రిలో చేరారు. కొద్ది రోజుల చికిత్స అనంతరం బుధవారం(మే 12) పూర్తిగా కోలుకున్నారు. దొరెస్వామి ఐదు రోజుల క్రితం బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేరి బుధవారం పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి అయ్యారు.
హైదరాబాద్ శివారులోని కీసరలో ఉన్న ఓ ఆశ్రమంలో రామానంద తీర్థ(110) నివసిస్తున్నారు. ఏప్రిల్ 24న కరోనా లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరారు. కొద్దిరోజుల చికిత్సతో ఆయన పూర్తిగా కోలుకున్నారు. బుధవారం(మే 12) నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఆయనకు నెగటివ్గా నిర్దారణ అయింది.ప్రస్తుతం ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజా రావు వెల్లడించారు. అయినప్పటికీ కొద్దిరోజులు సాధారణ వార్డులో ఆయన్ను అబ్జర్వేషన్లో ఉంచుతామని తెలిపారు.
తెలంగాణలోనే కాదు కర్ణాటకలోనూ ఓ శతాధిక వృద్దుడు తాజాగా కరోనాను జయించారు. గాంధేయవాది,స్వాతంత్య్ర సమరయోధుడు అయిన 103 ఏళ్ల దొరెస్వామి కరోనా నుంచి కోలుకుని బుధవారం(మే 12) డిశ్చార్జి అయ్యారు.
'ఐదు రోజుల క్రితం నాలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. కానీ పెద్దగా ఇబ్బందిపెట్టే ఆరోగ్య సమస్యలేవీ తలెత్తలేదు. అయినప్పటికీ.. ముందు నుంచి నాకు కొంత శ్వాస సంబంధిత సమస్యలు ఉండటంతో ఆస్పత్రిలో చేరాలని నిర్ణయించుకున్నాను. చికిత్స తర్వాత ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి అవుతున్నాను...' అని దొరెస్వామి తెలిపారు.
దొరెస్వామి చికిత్స పొందిన ఆస్పత్రి డైరెక్టర్,డా.సి.ఎన్ మంజునాథ్ ఆయన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన చికిత్స అందించారు. డా.మంజునాథ్ మాజీ ప్రధాని హెచ్డి దేవె గౌడ అల్లుడు. దేవె గౌడ సూచన మేరకు దొరెస్వామి ఆరోగ్యం పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు.
దొరెస్వామి పూర్తి పేరు హరొహళ్లి శ్రీనివాసయ్య దొరెస్వామి. ఏప్రిల్ 10,1918లో ఆయన జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ఆయన 1943-1944 మధ్య 14 నెలల జైలు శిక్ష అనుభవించారు. అప్పట్లో మైసూరు ఛలో ఉద్యమంలోనూ ఆయన పాల్గొన్నారు. బెంగళూరు సెంట్రల్ కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో దొరెస్వామి డిగ్రీ పూర్తి చేశారు. చాలా ఏళ్ల పాటు ఆయన టీచింగ్ చేశారు. అప్పట్లో పౌరవాణి అనే పత్రికను తెచ్చేందుకు కూడా ప్రయత్నించారు.
Recommended Video
కాగా,శతాధిక వయసులోనూ కరోనాను జయిస్తున్నవాళ్లు చాలామందిలో మానసిక స్థైర్యం నింపుతున్నారు. గత నెలలో మధ్య ప్రదేశ్లోని బెతుల్కి చెందిన 103 ఏళ్ల బిర్దిచంద్ అనే వృద్ధుడు కూడా కరోనాను జయించాడు.కోవిడ్ లక్షణాలు ఉన్నప్పటికీ బిర్దిచంద్ ఏమాత్రం భయపడలేదు. బలవర్ధకమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పాజిటివ్ ఆలోచనలతో ఉండటం వల్ల ఆయన వైరస్ను జయించాడని బిర్దిచంద్ కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో 93 ఏళ్ల నర్సమ్మ అనే వృద్దురాలు ఇటీవల కరోనాను జయించారు. ఎటు చూసినా విషాద దృశ్యాలే కనిపిస్తున్న వేళ.. ఇలాంటి వృద్దులను ఆదర్శంగా తీసుకుని కరోనాపై పోరాడాల్సిన అవసరం ఉంది.