బ్యాంక్ స్కామ్ : కరీంనగర్ యూనియన్ బ్యాంకులో బయటపడ్డ భారీ కుంభకోణం
కరీంనగర్ : ఈ మధ్య కాలంలో వరుసగా బ్యాంకు స్కాములు వెలుగు చూస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని కరీంనగర్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరో భారీ స్కామ్ బయటపడింది. రూ.12 కోట్ల మేర భారీ కుంభకోణం వెలుగు చూసింది. బ్యాంకు చెస్ట్ మేనేజర్ కొందరు ప్రైవేట్ వ్యక్తులకు ఈ డబ్బును అప్పుగా ఇచ్చినట్లు ఉన్నతాధికారుల తనిఖీల్లో బయటపడింది. ఈ స్కాము ఎలా జరిగిందనే దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. త్వరలో దీన్ని సీబీఐకి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. ఈ గోల్మాల్ వ్యవహారానికి సంబంధించి బ్యాంక్ చెస్ట్ మేనేజర్ సురేష్ కుమార్తో పాటు మరో ముగ్గురుని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇప్పటికే దేశంలోని బ్యాంకులను కొందరు బడా పారిశ్రామికవేత్తలు వందల కోట్లలో రుణాలను పొంది దేశం దాటి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రముఖ లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా లండన్లో తలదాచుకుంటుండగా మరో వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, చోక్సీ మోడీలు దేశాలు దాటి పోయారు. నీరవ్ మోడీ ఈ మధ్యనే లండన్లో ఓ కాస్లీ జాకెట్ ధరించి వీధుల్లో తిరుగుతుండగా ఓ విలేఖరి గమనించి ఆయన్ను పలు ప్రశ్నలు అడిగారు. అయితే నీరవ్ మోడీ మాత్రం సరైన సమాధానాలు చెప్పకుండా దాటవేశారు.
యూనియన్ బ్యాంక్లో పలు ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
మొత్తానికి బ్యాంకుల్లో డబ్బులు మాయమయ్యేందుకు అధికారులే సహకరిస్తుండటం విశేషం. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అధికారులే ఇలాంటి దోపిడీలకు పాల్పడితే ఇక ప్రజల డబ్బులు బ్యాంకుల్లో ఏ విధంగా సురక్షితంగా ఉంటాయని వారు ప్రశ్నిస్తున్నారు.