న్యూ లుక్..న్యూ ట్రెండ్: ఎంఎంటీఎస్ 2.O: మెట్రోతో పోటీ!
హైదరాబాద్: జంటనగరవాసులకు చిర పరిచితమైన ఎంఎంటీఎస్ రైళ్లు సరికొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. ఇప్పటిదాకా లేత నీలం రంగులో కనిపించిన ఎంఎంటీఎస్ రైళ్లన్నీ.. ఇక ముదురు గులాబీ వర్ణంలో మెరిసిపోతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ రైళ్లు కూడా అదనపు హంగులను సమకూర్చుకున్నాయి. ర్యాక్ ల సంఖ్యను 12 కు పెంచారు. ఇప్పటిదాకా ఎంఎంటీఎస్ రైళ్లకు తొమ్మిది ర్యాకులే ఉండేవి. వాటికి అదనంగా మరో మూడింటిని జత చేశారు. ఆటోమేటిక్ అనౌన్స్ మెంట్, జీపీఎస్ ఆధారిత రూట్ మ్యాప్, ఎల్ఈడీ డిస్ ప్లే.. వంటి వసతులను ఎంఎంటీఎస్ రైళ్లల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం- మేడే ను పురస్కరించుకుని బుధవారం ఎంఎంటీఎస్ లేటెస్ట్ వర్షన్ రైళ్లు పట్టాలెక్కాయి.
మెట్రో వర్సెస్ ఎంఎంటీఎస్..
ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్లల్లో రోజూ లక్షన్నర మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక్ సంవత్సరం ముగిసే సరికి ఈ సంఖ్యను రెండున్నర లక్షలకు పెంచాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు టార్గెట్ గా పెట్టుకున్నారు. ర్యాక్ ల సంఖ్యను పెంచడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం కూడా అదే. మరింత మందిని గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా అటు ఆదాయాన్ని పెంచుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మరోవంక- మెట్రో రైళ్ల రూపంలో పోటీ వ్యవస్థ ఎదురు కావడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు దానికి ధీటుగా ఎంఎంటీఎస్ ను అభివృద్ధి చేశారు.
ఇప్పటిదాకా లేని సరికొత్త వ్యవస్థ..
కొత్తగా పట్టాలెక్కిన ఎంఎంటీఎస్ రైళ్లన్నీ అత్యధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. ట్రైన్ కంట్రోల్, మేనేజ్ మెంట్ వ్యవస్థ ద్వారా వీటి రాకపోకలన్నీ పనిచేస్తాయి. ఫలితంగా- ఏ రైలు, ఎన్ని నిమషాలకు, ఏ స్టేషన్ కు వస్తుందనే విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారించ వచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. విద్యుత్ ను పునరుత్పాదించే బ్రేకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. బ్రేక్ వేసినప్పుడల్లా విద్యుత్ ఆదా అయ్యేలా ఏర్పాటు చేశారు.
మహిళల కంపార్ట్ మెంట్లల్లో సీసీటీవీ
మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాకుల్లో సీసీటీవీలను ఏర్పాటు చేశారు. ఇప్పటిదాాకా ఈ వ్యవస్థ ఎంఎంటీఎస్ రైళ్లల్లో ఉండేది కాదు. అలారం వ్యవస్థను అందుబాటులో తెచ్చారు. పురుషులు గానీ, ఈ ర్యాకుల్లో ఎక్కిన వెంటనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసేలా ఈ అలారం వ్యవస్థ పని చేస్తుంది. ర్యాక్స్ లోపల, బయటి వైపు ఎల్ఈడీ ఆధారిత డిస్ ప్లే బోర్డులను అమర్చారు. ఎప్పటికప్పుడు స్టేషన్ల వివరాలు దానిపై ప్రదర్శితమవుతాయి. మెట్రో రైళ్ల తరహాలో ఆటోమేటిక్ అనౌన్స్ మెంట్ ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో స్టేషన్ అనౌన్స్ మెంట్ ఉంటుంది.
సీట్ల సామర్థ్యం పెంపు..
కొత్తగా ప్రవేశపెట్టిన ఎంఎంటీఎస్ రైళ్లలో మరింత మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేశారు. ఇదివరకు ఒక్కో ఎంఎంటీఎస్ రైలు సామర్థ్యం 700. తాజాగా దీన్ని 1150కి పెంచారు. 4,000 మంది వరకు ప్రయాణికులు నిల్చుని ప్రయాణం చేయవచ్చు. ప్రస్తుతం ఫలక్నుమా - లింగంపల్లి, ఫలక్నుమా - నాంపల్లి, సికింద్రాబాద్ - లింగంపల్లి, సికింద్రాబాద్ - నాంపల్లి, నాంపల్లి - లింగంపల్లి మార్గాల్లోనే కొత్త రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. క్రమంగా దీన్ని నగర శివార్ల వరకూ విస్తరించబోతున్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు.
ఇందులో భాగంగా.. మేడ్చల్-సికింద్రాబాద్ మార్గంలో కొన్ని రైళ్లను నడిపించడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నారు. మేడ్చల్-సికింద్రాబాద్ మధ్య ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టాలని కోరుతూ ఇదివరకు మల్కాజ్ గిరి ట్రైన్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు దక్షిణ మధ్య రైల్వేకు వినతిపత్రాన్ని అందజేసిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని- ఈ మార్గంలో ఎంఎంటీఎస్ రైలును నడిపించడానికి గల సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు.