తాను మరణించి నలుగురికి ప్రాణాలు పోసిన 12ఏళ్ల బాలుడు
హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్డెడ్ అయిన 12ఏళ్ల బాలుడి అవయవాలను దానం చేయడంతో మరో నలుగురు ప్రాణాలు నిలబడ్డాయి. కొడుకు మరణించడంతో అతని అవయవాల దానం చేసేందుకు అంగీకరించిన బాలుడి తల్లిదండ్రులు ఇందుకు కారణమయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది.
నిమ్స్ జీవన్దాన్ వర్గాల తెలిపిన వివరాల ప్రకారం.. ప్యారడైజ్ బాలంరాయి వద్ద నివాసం ఉండే పి.సత్యనారాయణ జీఎంఆర్ కార్గోలో మేనేజర్. భార్య విమల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. వీరికి వైష్ణవ్ (12) కొడుకు ఉన్నాడు. సత్యనారాయణ దంపతులు జులై 12న కారులో వైష్ణవ్తో పాటు బంధువుల పిల్లలు ముగ్గురితో కలిసి రామోజీ ఫిలింసిటీ వద్ద నుంచి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టింది.
ఈ దుర్ఘటనలో కారు వెనుక కూర్చున్న నలుగురు పిల్లలలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా వైష్ణవ్కు తీవ్రగాయాలయ్యాయి. కారు నడుపుతున్న సత్యనారాయణకు ఛాతీపై బలమైన గాయాలు కాగా, విమల కాలు విరిగింది. ముగ్గురినీ వెంటనే సన్షైన్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వైష్ణవ్ను అక్కడి నుంచి లక్డికాపూల్లోని గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతున్న వైష్ణవ్కు మంగళవారం బ్రెయిన్ డెడ్ అయింది. జీవన్దాన్ ప్రతినిధులు సన్షైన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ, విమల వద్దకు వెళ్లి విషయం చెప్పి వారిని వైష్ణవ్ అవయవాలను దానం చేసేందుకు ఒప్పించారు.
వైద్యులు వైష్ణవ్ శరీరం నుంచి రెండు కిడ్నీలు, కాలేయం, గుండెను తొలగించారు. ఆస్పత్రి నుంచి అంబులెన్స్లో శంషాబాద్ ఎయిర్పోర్టుకు, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. ఎయిర్ పోర్టు నుంచి ఆస్పత్రికి పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు బాలుడి అవయవాలతో ప్రాణాలు పోశారు వైద్యులు.