తెలంగాణలో ఒక్కరోజులో భారీగా పెరిగిన కరోనా కేసులు, 3వేలకుపైగా, ఏడుగురు మృతి
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. బుధవారం ఒక్కరోజే 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వీటిలో 127 కరోనా కేసులు రాష్ట్రానికి చెందినవి కాగా, మరో 2 కరోనా కేసులు వలస కార్మికులకు చెందినవి ఉన్నాయి.
కాగా, ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 108 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. తాజాగా నమోదైన 129 కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3020కి చేరింది. అయితే, లోకల్ కేసులు మాత్రం 2572 అని వైద్యారోగ్య శాఖ తెలిపింది.
బుధవారం కరోనాతో మరో ఏడుగురు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో చనిపోయినవారి సంఖ్య 99కి చేరింది. బుధవారం గుర్తించిన కరోనా కేసుల్లో ఇతర జిల్లాల్లోనూ నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
జీహెచ్ంఎసీ పరిధిలో 108 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 6, అసిఫాబాద్లో 6, మేడ్చల్, సిరిసిల్లలో 2 కేసుల చొప్పున, యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులను గుర్తించారు. ఇప్పటి వరకు 1556 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 1365 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.