భూమ్మీదే నరకం అంటే ఇదే! పదమూడేళ్లకే వ్యభిచార కూపంలోకి!
జాప్తి శివనూర్ వ్యభిచార గృహాలపై సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు జరిపిన దాడులలో మైనర్ బాలికలు కూడా పట్టుబడడం విస్మయం గొలుపుతోంది.
హైదరాబాద్: మెదక్ జిల్లా రామాయంపేట పరిధిలోని జాప్తి శివనూర్ లో వ్యభిచార గృహాలపై సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు జరిపిన దాడులలో మైనర్ బాలికలు కూడా పట్టుబడడం విస్మయం గొలుపుతోంది.
బుధవారం అర్థరాత్రి నిర్వహించిన ఈ దాడుల్లో పదిమంది బాలికలు సహా 30 మంది బాధితులను పోలీసులు కాపాడారు. 35 మంది నిర్వాహకులను, ఇద్దరు విటులను అరెస్టు చేశారు. ఈ దాడులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని శుక్రవారం హైదరాబాద్ లో సీఐడీ ఐజీ సౌమ్య మిశ్రా వెల్లడించారు.
బెంగళూరుకు చెందిన జస్టిస్ అండ్ కేర్ స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన సమాచారం మేరకు 30 మంది సోషల్ వర్కర్లు, సైకాలజిస్టులతోపాటు సీఐడీ అధికారులతో 30 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దాడులు నిర్వహించారు.
అరెస్టయిన 35 మంది నిర్వాహకులలో.. 21 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు. పోలీసులు వారి నుంచి రూ.4.85 లక్షలు, అకౌంట్ పుస్తకాలు, రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఫిలిప్పీన్స్, సౌదీ అరేబియాకు చెందిన కరెన్సీ కూడా దొరికింది.
బాధితులను రెస్క్యూ హోమ్ లకు తరలించారు. గతంలో యాదగిరిగుట్టలోని వ్యభిచార కేంద్రాలపై దాడులు జరిపినప్పుడు కూడా కొంతమంది బాలికలు పట్టుబడ్డారు. ఇప్పుడు జాప్తిశివనూర్ వ్యభిచార గృహాలపై జరిపిన దాడుల్లోనూ బాలికలు పట్టుబడడంతో అక్కడి నిర్వాహకులకు, ఇక్కడి నిర్వాహకులకు సంబంధాలు ఉన్నట్లు తేటతెల్లమవుతోంది.
పోలీసులు దాడుల్లో పట్టుబడిన బాలికలను గార్డియన్లకు అప్పగించవ్దని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నిర్ణయం తీసుకున్నప్పటికీ కోర్టు వారిని గార్డియన్లకే అప్పగించింది. వరంగల్ కు చెందిన ఓ బాలికకు ఉద్యోగం ఆశ చూపెట్టి ఇక్కడికి తీసుకొచ్చి వ్యభిచారం వృత్తి లోకి దించారు. ఆమెకు లభించే డబ్బును సోదరుడి వరసయ్యే వ్యక్తి వచ్చి తీసుకెళుతుంటాడు. అసలు ఇంతకన్నా నీచం ఇంకోటి ఉంటుందా?
అలాగే ఓ బాధితురాలు తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యతోపాటు కాళ్ల వాపుతో బాధపడుతోంది. ఆమెను పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు బాధితులు గర్భవతులు. ఇంకో ముగ్గురికి హెచ్ఐవీ ఉన్నట్లు కూడా గుర్తించారు. ఇక కర్ణాటకకు చెందిన ఓ మహిళతోపాటు మరో ఇద్దరు యువతులకు మతిస్థిమితం సరిగా లేదు.