రియల్ భూం: ఇందూరులో 1386 రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వానికి 1.48 కోట్ల ఆదాయం, కానీ...
లాన్డౌన్ వల్ల బోసిపోయిన రియల్ రంగం మళ్లీ పుంజుకుంటోంది. దాదాపు 40 రోజుల తర్వాత ఎప్పటిలాగే కొనుగోళ్లు జరుగుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరుగడం ఊరటనిచ్చే అంశం. ఈ నెల 6వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగం పెరగడంతో ప్రభుత్వానికి కొంత ఆదాయం సమకూరింది. మిగతా చోట్ల కూడా రియల్ భూమ్ పెరిగితే.. ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోందని నిపుణులు చెబుతున్నారు.
10 రిజిస్ట్రేషన్ ఆఫీసులు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 10 రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉన్నాయి. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ఆరంభంలో భూముల రిజిష్ట్రేషన్లతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది. కానీ లాక్ డౌన్ వల్ల నెలన్నర రోజులు రిజిస్ట్రేషన్ ప్రక్రియకు బ్రేక్ పడింది. వైరస్ లేనిచోట సడలింపులు ఇవ్వడంతో తిరిగి రిజిస్ట్రేషన్లు క్రమంగా జరుగుతోన్నాయి. అంతకుముందు ఉమ్మడి జిల్లా నుంచి రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.10 కోట్ల ఆదాయం సమకూరేది. నెలన్నరపాటు కార్యకలాపాలు నిలిచిపోవడంతో రూ.15 కోట్ల ఆదాయం కోల్పోయినట్టయ్యింది.
6వ తేదీ నుంచి స్పీడప్
నిజామాబాద్ జిల్లాలో వైరస్ తగ్గడం.. రెడ్ జోన్ నుంచి ఆరంజ్ జోన్లోకి రావడంతో ఆస్తుల విక్రయాల ప్రాసెస్ ఊపందుకొంది. ఆఫీసుల్లో భూముల రిజిస్ట్రేషన్తోపాటు.. ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ కూడా చేపట్టారు. స్లాట్ బుకింగ్ ప్రకారం క్లయింట్స్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 1386 రిజిష్ట్రేషన్లు చేశారు. దీంతో ప్రభుత్వానికి రూ.1.48 కోట్ల ఆదాయం సమకూరింది.
జర్నీ పాస్ కూడా..
లాక్ డౌన్ సడలింపులతో రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయని నిజామాబాద్ రిజిస్ట్రార్ ప్రకాశ్ తెలిపారు. చలానా కట్టి స్లాట్ కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ బుక్ చేసుకుంటున్నారని తెలిపారు. స్లాట్తోపాటు తమ కార్యాలయానికి వచ్చేందుకు జర్నీ పాస్ ఇస్తున్నామని.. దీంతో వారికి ఇబ్బందులు రావడం లేదు అని చెప్పారు. రిజిస్ట్రేషన్ల సంఖ్య మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
నో ఫిజికల్ డిస్టన్స్, నో మాస్క్
ఉమ్మడి జిల్లాలో రిజిష్ట్రేషన్లు పెరిగే అంశం రిలీఫ్ కలిగిస్తోంది. కానీ క్లయింట్లు నిబంధనలను ఉల్లంఘించడం ఆందోళన కలిగిస్తోంది. ఆఫీసులో మూడు అడుగుల దూరం ఉండాలనే విషయాన్ని కొందరు మరచిపోయారు. మరికొందరు మాస్క్ కూడా ధరించలేదు. మాస్క్ కట్టుకోవాలని కార్యాలయ సిబ్బంది వారికి చెప్పలేదు. మాస్క్ లేకుండా ఆఫీసులోకి రానీయమని కఠినమైన నిబంధనలు పెట్టాల్సిన అవసరం ఉంది.