139 మంది రేప్ కేసులో బిగ్ ట్విస్ట్... వాళ్లకు బాధితురాలి క్షమాపణలు... ఇప్పుడు కేసు 3 భాగాలు...
సంచలనం రేకెత్తించిన యువతిపై 139 మంది రేప్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజా శ్రీకర్ రెడ్డి అలియాస్ డాలర్ బాయ్ ఒత్తిడి మేరకే తాను 139 మందిపై ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు వెల్లడించింది. ఇందులో కొంతమంది పేర్లు ఫిర్యాదులో రెండుసార్లు వచ్చాయని... అలా నంబర్ కూడా పెరిగిందని పేర్కొంది. తనకు జరిగిన అన్యాయం వాస్తవమేనని.. కానీ సంబంధం లేని పేర్లను కూడా డాలర్ బాయ్ చేర్చాడని పేర్కొంది. తనను మానసికంగా,శారీరకంగా చిత్రహింసలకు గురిచేసి బలవంతంగా కేసు పెట్టించాడని చెప్పింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ,తెలంగాణప్రదేశ్ ఎరుకల సంఘం,సామాజిక కార్యకర్తలు సంధ్య,సజయలతో కలిసి బాధితురాలు సోమవారం ప్రెస్ మీట్ ద్వారా వివరాలు వెల్లడించారు.
అలాంటి పరిస్థితుల్లోనే 139మందిపై ఫిర్యాదు...
సంబంధం లేని పేర్లను చేర్చడం వల్ల అన్యాయంగా వారు బలైపోతారని తాను ఎంత చెప్పినారాజా శ్రీకర్ రెడ్డి వినలేదని బాధితురాలు పేర్కొంది. అతనో సైకో అని... అంతకుముందు అతను హత్య చేసిన అమ్మాయిల శరీర భాగాలను ల్యాప్టాప్లో చూపించి భయపెట్టాడని చెప్పింది. తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని.. ఫిర్యాదు చేసిన రోజు రాత్రి తనను చచ్చేలా కొట్టాడని... అదే స్థితిలో తాను పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని అన్నారు.ఆ తర్వాత నుంచి ప్రతీది తాను చెప్పినట్లే చేయాలని తనను హింసించాడని చెప్పుకొచ్చింది.
సెలబ్రిటీలకు సంబంధం లేదు...
సంబంధం లేకపోయినా ప్రదీప్,కృష్ణుడు లాంటి సెలబ్రిటీల పేర్లను రాజా శ్రీకర్ రెడ్డేఫిర్యాదులో చేర్చాడని బాధితురాలు చెప్పింది. తనతో ఏ సంబంధం లేకపోయినా ఈ కేసులోకి లాగబడ్డవారికి క్షమాపణలు చెబుతున్నానని తెలిపింది. ఏ సమయంలోనూ.. ఎవరితోనూ ఈ కేసుపై చర్చించేందుకురాజా శ్రీకర్ రెడ్డి తనకు అవకాశం ఇవ్వలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఏ కాల్ వచ్చినా లౌడ్ స్పీకర్ ఆన్ చేసే మాట్లాడమనేవాడని... ఆఖరికి వాష్రూమ్ వెళ్లినా డోర్ బయటే కాపలా కాసేవాడని వాపోయింది.
కేసు 3 భాగాలు...
139 మంది తనపై రేప్ చేయలేదని... ఇందులో 50శాతం మంది అత్యాచారానికి పాల్పడగా,మరో 50శాతం మంది వేధింపులకు గురిచేశారని బాధితురాలు వెల్లడించింది. ఇప్పుడీ కేసు వివరాలను మూడు భాగాలుగా విభజించామని తెలిపింది. తనపై అత్యాచారానికి పాల్పడ్డవాళ్లు,వేధింపులకు గురిచేసినవాళ్లు,ఈ కేసుతో సంబంధం లేనివారు.. ఇలా మూడు భాగాలుగా పేర్లను విభజించామని చెప్పింది. తనకు జరిగిన అన్యాయం మరో ఆడపిల్లకు జరగవద్దనే తాను బయటకొచ్చానని మరోసారి స్పష్టం చేసింది. కొంతమంది తన పేరును,ఫోటోలను సర్క్యులేట్ చేస్తున్నారని.. దయచేసి ఇకనైనా ఆపేయాలని విజ్ఞప్తి చేసింది.
Recommended Video
రాజా శ్రీకర్ రెడ్డి పెద్ద చీటర్...
ఇన్నాళ్లు తాను 50శాతం నరకం అనుభవిస్తే...రాజా శ్రీకర్ రెడ్డి వద్ద మరో 50శాతం నరకం అనుభవించానని వాపోయింది.రాజా శ్రీకర్ రెడ్డి గతంలో ఇద్దరు మహిళలను ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని... ఒక మహిళకు పిల్లలు కూడా ఉన్నారని చెప్పింది. మొదటి మహిళతో ఇటీవల మాట్లాడగా... రాజా శ్రీకర్ రెడ్డి అత్యంత మోసగాడని పేర్కొనట్లు చెప్పింది. ఇప్పుడతను మారిపోయి ఉంటాడేమో అనుకుంటున్నానని... ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడా అని ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు చెప్పింది. ఈ కేసులో తనకు అండగా నిలబడుతానని చెప్పినట్లు తెలిపింది. రాజా శ్రీకర్ రెడ్డి పై గతంలోనూ సీసీఎస్లో కేసు నమోదైనట్లు పేర్కొంది.