తెలంగాణలో తగ్గని కరోనా వ్యాప్తి: 20వేలకుపైనే యాక్టివ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. కరోనా పరీక్షల సంఖ్య పెంచనప్పటికీ కరోనా కేసులు మాత్రం క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా, గురువారం 38,484 కరోనా పరీక్షలను నిర్వహించగా.. 1421 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,29,001కి చేరింది.
తెలంగాణలో తగ్గిన కరోనా పరీక్షలు.. కొత్త కేసులు కూడా, పెరిగిన రికవరీ
కరోనా బారినపడి కొత్తగా ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారిసంఖ్య 1298కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 249 కరోనా కేసులు నమోదైనట్లు తెలిపింది.
తాజాగా, 1221 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటి వరకు 2,07,326 మంది కరోనాను జయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,337 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు తెలిపింది. 17,214 మంది హోంఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది.
ఇది ఇలావుంటే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. దేశంలో వరుసగా ఐదో రోజూ కరోనా పాజిటివ్ కేసులు 60వేల లోపే నమోదయ్యాయి. గత 24 గంటల్లో 14,42,722 పరీక్షలు నిర్వహించగా, 54,366 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,61,312కి చేరింది.
Recommended Video
తాజాగా 690 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా మృతిచెందినవారి సంఖ్య 1,17,306కు చేరింది. ఇక గత 24 గంటల్లో 73,979 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 69,48,497కు చేరింది. కాగా, దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 7 లక్షల దిగువకు రావడం గమనార్హం. ప్రస్తుతం 6,95,509 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో రికవరీ రేటు 89.53 శాతానికి చేరింది. మరణాల రేటు 1.51 శాతంగా ఉంది.