కేసీఆర్ బంధువుల కిడ్నాప్.. పక్కా సినీ ఫక్కీలో.. గంటల్లోనే చేధించిన పోలీసులు.. అఖిలప్రియ భర్త హస్తం?
హైదరాబాద్లోని బోయినపల్లిలో మాజీ హాకీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు ఆయన ఇద్దరు సోదరులు సునీల్ రావు,నవీన్ రావుల కిడ్నాప్ కథ సుఖాంతమైంది. సమాచారం అందిన రెండు,మూడు గంటల్లోపే పోలీసులు ఈ కిడ్నాప్ను చేధించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మొదటి కిడ్నాపర్ల కార్ నంబర్లను చేధించిన పోలీసులు... ఆ తర్వాత పలు బృందాలుగా ఏర్పడి ఎక్కడికక్కడ తనిఖీలు చేశారు.
Recommended Video
ఈ క్రమంలో ఎట్టకేలకు 15 మంది కిడ్నాపర్లను పట్టుకున్నారు. వారి చెర నుంచి బాధితులు ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ కిడ్నాప్ వెనుక ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ రామ్ హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తోంది.
సినీ ఫక్కీలో కిడ్నాప్
సికింద్రాబాద్లోని బోయిన్పల్లిలో మనోవికాస్ నగర్లో ఉన్న ప్రవీణ్ రావు,సునీల్ రావు,నవీన్ రావుల ఇంటికి మంగళవారం(జనవరి 5) రాత్రి 7.30గంటల సమయంలో మూడు కార్లు వచ్చాయి. అందులో దాదాపు 15 మంది అక్కడికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో... తాము ఇన్కమ్ ట్యాక్స్,పోలీస్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చామని చెప్పి లోపలకు ప్రవేశించారు. ఇందులో 12 మంది ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల గెటప్లో,ముగ్గురు పోలీసుల గెటప్లో వెళ్లారు. సెక్యూరిటీ సిబ్బందికి నకిలీ ఐడీ కార్డు చూపించి ఇంట్లోకి చొరబడ్డారు.
ఇంట్లోకి వెళ్లి వెళ్లగానే...
ఇంట్లోకి వెళ్లి వెళ్లగానే ప్రవీణ్ రావు,సునీల్ రావు,నవీన్ రావులను ముగ్గురిని వేర్వేరు గదుల్లో నిర్బంధించారు. కుటుంబ సభ్యులను బెదిరించి వేరే గదిలోకి పంపించారు. ఆ ముగ్గురికి సంబంధించి సెల్ఫోన్స్,ల్యాప్ ట్యాప్స్,ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ స్వాధీనం చేసుకున్నారు. హఫీజ్పేట్ భూమికి సంబంధించిన పత్రాలు చూపించాలని వారిపై ఒత్తిడి చేశారు. అనంతరం ముగ్గురిని బలవంతంగా కారులో ఎక్కించి అక్కడినుంచి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని మహబూబ్నగర్లోని ప్రవీణ్ రావు మరో సోదరుడు ప్రతాప్ కుమార్కు ఫోన్ చేసి చెప్పారు.
హుటాహుటిన మంత్రి శ్రీనివాస్ గౌడ్,సీపీ...
ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు,పలువురు పోలీస్ అధికారులకు ప్రతాప్ కుమార్ ఫోన్ చేసి ఆరా తీయగా... తాము ఎక్కడా సోదాలు నిర్వహించలేదని అధికారులు స్పష్టం చేశారు. దీంతో వచ్చినవాళ్లు ఫేక్ ఆఫీసర్స్,పోలీసులు అయి ఉంటారని భావించి రాత్రి 10గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్తో వున్న పరిచయం మేరకు ఆయనకు కూడా ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో మంత్రి హుటాహుటిన అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పోలీసులు త్వరలోనే కిడ్నాప్ను చేధిస్తారని భరోసానిచ్చారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ కూడా ప్రవీణ్ రావు ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎట్టకేలకు చేధించిన పోలీసులు
సీపీ అంజనీ కుమార్ నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపి నగరమంతా గాలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మూడు కార్ల నంబర్లు గుర్తించగలిగారు. పోలీసులు ముమ్మరంగా తనిఖీ చేస్తున్న విషయం తెలుసుకున్న కిడ్నాపర్లు.. ఇక తప్పించుకోలేమని భావించి ప్రవీణ్ రావు,నవీన్ రావు,సునీల్ రావులను కోకాపేట సమీపంలో వదిలేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు,ఆ ముగ్గురితో కొన్ని వైట్ పేపర్స్పై కిడ్నాపర్లు సంతకాలు చేయించుకున్నట్లు సమాచారం. ఎట్టకేలకు తెల్లవారుజామున 3.30గం. సమయంలో ముగ్గురు అన్నాదమ్ములు ఇంటికి తిరిగొచ్చారు. అనంతరం ఆ 15 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో చంద్రబోస్ అనే నిందితుడు ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ రామ్ సోదరుడిగా అనుమానిస్తున్నారు.
భూమా అఖిలప్రియ భర్త హస్తం?
కిడ్నాప్ సమయంలో భార్గవ రామ్ పేరుతోనే కిడ్నాపర్లు ముగ్గురు అన్నాదమ్ముళ్లను బెదిరించినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన కొన్ని భూ లావాదేవీల నేపథ్యంలో ఈ కిడ్నాప్ జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాప్ వెనుక భార్గవ రామ్ ఉన్నట్లు పోలీసులు ఇప్పటికే ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. గతంలోనూ పలుమార్లు భూమా అఖిలప్రియ ప్రవీణ్ రావు ఇంటికి వెళ్లి హఫీజ్ పేట్ భూ వ్యవహారంపై మాట్లాడినట్లు తెలుస్తోంది.
అయితే ఆ లావాదేవీలన్నీ తాము ఎప్పుడో పూర్తి చేసేశామని... ఇక వాటితో తమకెలాంటి సంబంధం లేదని వారు అఖిలప్రియతో చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ముగ్గురు అన్నాదమ్ముళ్లను కిడ్నాప్ జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం(జనవరి 6) హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ దీనిపై మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.