మరో ప్రమాదం: టైరు పేలి చెట్టుకు ఢీకొన్న బస్సు, టాప్పైనుంచి పైడి 15మందికి గాయాలు
నాగర్కర్నూలు: జిల్లాలోని బిజినేపల్లి మండలం వట్టెం వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. 100 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు టైరు వట్టెం గ్రామం వద్ద ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో బస్సు అదుపుతప్పింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
కొండగట్టు ప్రమాదం: బస్సుకు ఫిట్నెస్ లేదు, బ్రేకులు ఫెయిల్, విరిగిన స్టీరింగ్.. కండక్టర్ కంటతడి
కిక్కిరిసిన బస్సు
యాదగిరిగుట్ట డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ మీదుగా వనపర్తి వెళ్తోంది. వివిధ ప్రాంతాల్లో ఎక్కిన ప్రయాణికులతో బస్సు కిక్కిరిసిపోయింది. దీనికి తోడు ఆదివారం వీఆర్వో పరీక్ష ఉండటంతో చాలా మంది అభ్యర్థులు బస్సు టాప్ పైకి ఎక్కారు.
పేలిన టైరు.. అప్రమత్తమైన డ్రైవర్..
సుమారు 30 మంది వరకు యువకులు టాప్పై ప్రమాదకర స్థితిలో ప్రయాణిస్తున్న సమయంలో బస్సు ముందర రెండు టైర్లు పేలిపోయాయి. డ్రైవర్ అప్రమత్తతో బ్రేకులు వేయడంతో బస్సు రహదారి పక్కకు వెళ్లి చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది.
బస్సు పైనుంచి కిండిపడిన యువకులు
బస్సు కుదుపులకు లోను కావడంతో టాప్ పైన ఉన్న వారిలో సుమారు 15 మంది వరకు కిందపడి గాయాలపాలయ్యారు. బస్సు లోపల ఉన్న వారిలో కొందరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నాగర్కర్నూలు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్కు తరలించారు.
కొండగట్టు ప్రమాదం మరువక ముందే.. మహేందర్ రెడ్డి ఆరా..
బిజినేపల్లి వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్రెడ్డి ఆరా తీశారు. డ్రైవర్లు, కండక్టర్లు నిబంధనలు పాటించి తీరాలని ఆయన ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. కొండగట్టులో గత మంగళవారం జరిగిన ఘోర ప్రమాదం నుంచి ఇంకా తేరుకోకముందే మరోసారి ఇలాంటి ప్రమాదం సంభవించడంతో ప్రజలు ఆర్టీసీ ప్రయాణంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.