షాకింగ్ : కరోనాతో తెలంగాణలో ఒకే రోజు 14 మంది మృతి... 154 కొత్త కేసులు
తెలంగాణలో ఆదివారం (జూన్ 7) కొత్తగా మరో 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 132 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదవడం గమనార్హం. ఇక రంగారెడ్డిలో 12, మేడ్చల్లో 3, యాదాద్రిలో 2, సిద్దిపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, నాగర్కర్నూల్, కరీంనగర్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.కరోనాతో మరో 14 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,650కు చేరింది. ఇప్పటివరకూ 137 మంది ప్రాణాలు కోల్పోగా, 1,742 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,771 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా లక్షణాలు బయటపడ్డవారికి జిల్లా స్థాయి వైద్య కేంద్రాల్లోనే చికిత్స అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి,నియంత్రణ చర్యలపై ఆదివారం ఆయన ఉన్నతాధికారులతో సమావేశం సమీక్ష నిర్వహించారు.
లాక్ డౌన్ కారణంగా ప్రజలు జీవనోపాధి కోల్పోయి ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతోనే సడలింపులు ఇచ్చామని ఈటల గుర్తుచేశారు. అంతే తప్ప,ప్రజలు అవసరం ఉన్నా లేకపోయినా బయట తిరగడం మంచిది కాదని... అనవసరంగా ప్రాణాల మీదకు కొని తెచ్చుకోవద్దని హితవు పలికారు. లాక్ డౌన్ సడలింపు తర్వాతే కేసుల సంఖ్య పెరిగిందన్నారు. కరోనా పట్ల అనవసర అపోహలు,ఆందోళనలు కూడా అవసరం లేదన్నారు.
ఇంటి పక్కన ఎవరికైనా కరోనా వస్తే.. తమకెక్కడ సోకుతుందోనని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయని.. ఇది సరికాదని అన్నారు. హోమ్ క్వారెంటైన్లో ఉండేందుకు కేంద్రం అనుమతిచ్చిందని.. కానీ ప్రజల్లో నెలకొన్న భయం కారణంగా వారు ఆసుపత్రిలో ఉండేందుకే మొగ్గుచూపుతున్నారని అన్నారు.
Recommended Video
కరోనా పాజిటివ్ పేషెంట్ల సంఖ్య పెరిగితే వైద్య వ్యవస్థపై,ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని ఈటల అన్నారు. కాబట్టి ప్రజలు దాన్ని దృష్టిలో ఉంచుకుని.. తక్కువ లక్షణాలు ఉన్నవారు లేదా లక్షణాలు బయటపడని పేషెంట్లు హోమ్ క్వారెంటైన్లో ఉండేందుకు సహకరించాలన్నారు.