హెచ్ఐసీసీలో ప్రారంభమైన బయో ఏషియా సదస్సు
హైదరాబాద్: నగరంలోని హెచ్ఐసీసీలో గురువారం సాయంత్రం బయో ఏషియా సదస్సు ప్రారంభమైంది. ఈ నెల 24 వరకు ఈ సదస్సు జరగనుంది. రాష్ట్ర మంత్రి కేటీఆర్, 50 దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఇన్నోవేషన్ ఎక్స్పొనెన్షియల్ మెడిసిన్, బయో మార్కర్స్ క్యాన్సర్ డయాగ్నోస్టిక్స్, డిజిటల్ హెల్త్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశాలపై ప్రధానంగా ఈ సదస్సులో ప్రసంగించనున్నారు.
శుక్రవారం ఉదయం 10 గంటలకు నోవార్టిస్ ఫార్మా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీరాం అర్ధే, స్విట్జర్లాండ్కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ప్రొఫెసర్ మిచెల్ ఎన్ హాల్ కీలకోపన్యాసం చేయనున్నారు.
శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సీఈవో కాంక్లేవ్లో భాగంగా జరిగే చర్చలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ సతీశ్రెడ్డి, నోవార్టిస్ ఇండియా అధ్యక్షుడు జావెద్ జియా, డెలాయిట్ వైస్ చైర్మన్ గ్రేగోరి రే తదితరులు పాల్గొంటారు.
శుక్రవారం, శనివారం.. జీవ సాంకేతికపరమైన అంశాలపై టెక్నికల్ సెషన్లు జరుగనున్నాయి. శుక్రవారం సాయంత్రం జరిగే సెషన్లో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి సురేశ్ ప్రభు, మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. ప్రపంచ మార్కెట్లో వస్తున్న మార్పులు, అందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.
ఈ బయో ఏషియా సదస్సు సందర్భంగా హెచ్ఐసీసీలో ఫార్మా అనుబంధ రంగాలపై ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. 50కి పైగా దేశాలకు చెందిన కార్పొరేట్ కంపెనీలు తమ ఉత్పత్తులు, యంత్ర పరికరాలను ప్రదర్శించనున్నాయి.