16శాతం ఐఆర్: రేపటి ఆర్టీసీ సమ్మె విరమణ!, హరీశ్ది ద్విపాత్రాభినయమంటూ కేటీఆర్, ఎన్ఎంయూ ఫైర్
హైదరాబాద్: జూన్ 11 నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టనున్నట్లు ప్రకటించిన సమ్మె విరమించుకున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు 25శాతం ఐఆర్ డిమాండ్ చేయగా.. ప్రభుత్వం 16శాతం ఇచ్చేందుకు అంగీకరించింది. దీంతో కార్మిక సంఘాలు సానుకూలంగా స్పందించి ఆర్టీసీ సమ్మెను విరమించుకుంటున్నట్లు ప్రకటించాయి.
మంత్రుల ఉపసంఘంతో ఆర్టీసీ సంఘాల సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.
16శాతం ఐఆర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ కార్మికుల జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని భావించారని.. అందుకే వారు 43శాతం ఫిట్మెంట్ అడిగితే.. కేసీఆర్ 44శాతం ప్రకటించారని మంత్రి ఈటెల గుర్తు చేశారు. కార్మికులు బాగా పనిచేసి ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకురావాలని కోరారు. ప్రస్తుతం కార్మికులు 25శాతం ఫిట్మెంట్ అడిగారని, అయితే, ప్రభుత్వం 16శాతం ఇచ్చేందుకు అంగీకరించిందని తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ 650కోట్ల నష్టాలతో నడుస్తోందని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
నెలకు 16కోట్లు, ఏడాదికి రూ.200కోట్ల భారం
రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 16శాతం ఐఆర్ పెంచడంతో ప్రభుత్వంపై నెలకు రూ.16కోట్ల భారం పడుతుందని, ఏడాదికి రూ.200కోట్ల భారం పడనుందని చెప్పారు. ఆర్టీసీకి నష్టాలు రాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. 3వేల కోట్ల అప్పులున్నప్పటికీ కార్మికులకు 16శాతం ఐఆర్ ప్రకటించామని చెప్పారు.
హరీశ్ ద్విపాత్రాభినయమంటూ కేటీఆర్
మరో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ కార్మికుల పక్షపాతి అని అన్నారు. గతంలో 43శాతం ఫిట్మెంట్ కోరితే 44శాతం ఇచ్చారని గుర్తు చేశారు. అంతేగాక, అసంఘటిత కార్మికులకు బీమా సౌకర్యం కూడా కల్పించారని అన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా కార్మికులకు కేసీఆర్ అండగానే ఉన్నారని తెలిపారు. ఆర్టీసీ సంఘాలతో ఏడుగురు మంత్రులం చర్చించామని కేటీఆర్ చెప్పారు. కార్మిక సంఘాలతో చర్చలు సఫలం కావడం కోసం మంత్రి హరీశ్ రావు ఓ వైపు కార్మిక సంఘం నేతగా, మరో వైపు మంత్రిగా ద్విపాత్రాభినయం చేశారని ప్రశంసించారు. సమ్మె విరమణ చేయించి సుఖాంతం చేశారని అన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావుతోపాటు కార్మిక సంఘాల నేతలకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
కేసీఆర్కు , కార్మిక సంఘాలకు ధన్యవాదాలు
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. 16శాతం ఐఆర్ ఇచ్చేందుకు అంగీకరించిన సీఎం కేసీఆర్కు, సమ్మె విరమించిన కార్మిక సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తున్నారని అన్నారు. బీహెచ్ఈఎల్ బలోపేతం కోసం 6మెగావాట్ల విద్యుత్ ఇచ్చామని అన్నారు. టీఎంయూ ఉద్యమంలో తమతోపాటు నడిచిందని అన్నారు. ఆర్టీసీకి 3వేల కోట్ల అప్పులున్నాయని అన్నారు. ఈ అప్పులు తీర్చాలని, ఆర్టీసీ సామర్థ్యాన్ని పెంచాలని అన్నారు. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాలనేదే కేసీఆర్ సంకల్పమని హరీశ్ చెప్పారు.
ఆర్టీసీ సమస్యలపై.. కేసీఆర్ కోపం చూపారు
జులై నుంచి ఐఆర్ అందించబడుతుందని హరీశ్ రావు చెప్పారు. చిన్న చిన్నవాటికి ఆర్టీసీ ఉద్యోగులను సస్పెండ్ చేయకుండా కార్మికులు కోరినట్లు ఓ కమిటీ వేస్తామని చెప్పారు. ఆర్టీసీ నియామకాలు కూడా జరుగుతాయని అన్నారు. వృద్ధాప్యం, ఇతర కారణాల వల్ల పనిచేయకపోతో వారి పిల్లలకు అర్హతను బట్టి ఉద్యోగం కల్పించేలా చూస్తామని అన్నారు. సకల జనుల సమ్మె జీతాన్ని వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ చెప్పారని అన్నారు. ఇంకా చెల్లించలేదా? అంటూ కేసీఆర్ తనపై కోపం వ్యక్తం చేశారని తెలిపారు. కార్మికుల పన్నుల మినహాయింపు కూడా కమిటీలో పరిశీలిస్తామన్నారు. అప్పులు తీర్చడంతోపాటు ఆర్టీసీ సామర్థ్యాన్ని పెంచే చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
సమ్మె విరమించినట్లు టీఎంయూ.. ఎన్ఎంయూ ఆగ్రహం
అనంతరం కార్మిక సంఘాల నేతలు 16శాతం ఐఆర్ ప్రకటించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తాము సోమవారం నుంచి చేపట్టాలని నిర్ణయించిన సమ్మెను విరమించుకుంటున్నట్లు టీఎంయూ నేతలు ప్రకటించారు. త్వరలోనే మెరుగైన ఫిట్మెంట్ ఇస్తారని ఆశిస్తున్నామని అశ్వత్థామ రెడ్డి తెలిపారు. కాగా, ఇది ఇలా ఉండగా, సమ్మె విరమించుకుంటున్నట్లు ప్రకటించిన టీఎంయూపై మరో సంఘం ఎన్ఎంయూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వేతన సవరణకు పట్టుపట్టకుండా ఐఆర్కు ఎలా అంగీకరించారంటూ మండిపడుతోంది. కార్మికుల ఆశలపై టీఎంయూ నీళ్లు చల్లిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.