తల్లిని మాటల్లో పెట్టి, 16 నెలల ఆడశిశువు కిడ్నాప్
హైదరాబాద్: భాగ్యనగరంలో సంవత్సరంన్నర ఆడ శిశువు కిడ్నాప్కు గురైన సంఘటన బుధవారం నాడు చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గంగమ్మ తన భర్తతో గొడవపడి మహాత్మా గాంధీ బస్ స్టేషన్కు వచ్చి తలదాచుకుంది.
ఈ క్రమంలో ఓ గుర్తు తెలియని మహిళ అక్కడకు వచ్చి గంగమ్మను మాటలతో మభ్యపెట్టి, తన ఇంటికి తీసుకు వెళ్తానని చెప్పింది. ఆ మహిళ గంగమ్మను మాటలతో నమ్మించి, ఆమె దృష్టిని మరల్చి 16 నెలల శిశువును అపహరించింది.
ఈ దృశ్యాలు కాచికూడ రైల్వే స్టేషన్ పరిధిలోని సిసిటీవు ఫుటేజీలో రికార్డ్ అయ్యాయి. బాధితురాలు వెంటనే కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
వెహికల్ ఇన్స్పెక్టర్పై జడ్పీటీసీ భర్త దాడి
కరీంనగర్ జిల్లా అలగనూర్లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్పై జడ్పీటీసీ భర్త ఒకరు దాడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జడ్పీటీసీ భర్తపై కరీంనగర్ ఎల్ఎండీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
క్రికెట్ బెట్టింగ్ ముఠా స్థావరాలపై పోలీసుల దాడులు
భాగ్యనగరంలో సాగుతున్న క్రికెట్ బెట్టింగు ముఠా పైన సౌత్ జోన్ టాస్క్ పోలీసులు దాడులు చేశారు. సుల్తాన్ బజార్ క్రికెట్ బెట్టింగ్ స్థావరాల పైన పోలీసులు దాడి చేసి 13మందిని అరెస్టు చేశారు. వారి నుండి రూ.26 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన భారత్ - జింబాబ్వే మ్యాచ్లో బెట్టింగ్కు పాల్పడ్డారని తెలుస్తోంది.